Tirumala Alert: శ్రీవారి భక్తులకు గమనిక... తిరుమలలో 3 రోజులు ఈ సేవలు లభించవు
తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ. ఏప్రిల్ 21వ తేదీన ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు మాడవీధులలో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేశారు. ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు. రెండవరోజు ఏప్రిల్ 22న శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామివారు ఉదయం 8 నుండి 10 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. చివరిరోజు ఏప్రిల్ 23న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. కాగా ప్రతి రోజు సాయంత్రం 6 నుండి 6.30 గంటల వరకు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు. వసంత ఋతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు ఏర్పడింది. ఈ క్రతువులో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించటమే కాక వివిధ ఫలాలను కూడా నివేదించడం ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ. వసంతోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 23న అష్టదళ పాదపద్మారాధన, ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
2024-04-19T08:58:23Z
Weather Report: ఏపీ, తెలంగాణకు వర్ష సూచన.. తగ్గనున్న ఎండ తీవ్రత
నిన్న ముంబైలో భారీ వర్షాలు కురిశాయి. నిజానికి ఆ వర్షాలు తెలంగాణలో కురవాల్సి ఉంది. కానీ అరేబియా నుంచి మేఘాలు వేగంగా తెలంగాణ వైపు రాకపోవడంతో.. వర్షం అక్కడే కురిసేసింది. దాంతో.. హైదరాబాద్లో కురవాల్సిన వర్షం కురవకుండా పోయింది. మేఘాలు వచ్చినా, అనుకున్నంత చల్లదనం రాలేదు. తెలంగాణలో నిన్న కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. నిజామాబాద్లో వడగళ్ల వాన పడింది. ఏపీ మాత్రం భగ్గుమంది. మరి ఇవాళ ఎలా ఉంటుందో చూద్దాం. ఇవాళ్టి (20-4-2024) నుంచి 3 రోజులపాటూ తెలంగాణలో వర్షాలు కురుస్తాయి అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వానలు పడతాయని చెప్పింది. అందుకే కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరుగా ఉంటాయనీ, గాలుల వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుందని చెప్పింది. శనివారం ఆదిలాబాద్, మంచిర్యాల, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, మహబూబ్నగర్, జయశంకర్ భూపాలపల్లి, నారాయణపేట కొమరంబీం ఆసిఫాబాద్, నాగర్ కర్నూలు, కరీంనగర్, జనగామ, హన్మకొండ, సిద్ధిపేట, పెద్దపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. ఇవాళ ఏపీ, తెలంగాణలో ఉదయం నుంచే మేఘాలు ఉంటాయి. ఉదయం 11 గంటల సమయంలో హైదరాబాద్ పరిసరాల్లో చిరు జల్లులు పడతాయి. మధ్యాహ్నం 2 గంటలప్పుడు 2 రాష్ట్రాల్లో పూర్తిగా మేఘాలు ఉంటాయి. అలాగే ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్రలో జల్లులు కురుస్తాయి. ఆ తర్వాత రోజంతా మేఘాలు ఉంటాయి. ఐతే.. ఇవాళ పడే వర్షాలు చాలా తక్కువే. చినుకులు మాత్రమే. గాలి వేగం చూస్తే.. బంగాళాఖాతంలో గంటకు 14 నుంచి 33 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. ఏపీలో గంటకు 9 నుంచి 18 కిలోమీటర్లు, తెలంగాణలో గంటకు తెలంగాణలో గంటకు 11 నుంచి 18 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. ఉష్ణోగ్రత చూస్తే.. ఇవాళ తెలంగాణలో పగటి ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్ నుంచి 41 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరుగుతుంది. ఏపీలో ఏపీలో 38 డిగ్రీల నుంచి 42 డిగ్రీల సెల్సియస్ వరకూ పెరుగుతుంది. ఉత్తర తెలంగాణ, కోస్తా, ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమలో ఇవాళ ఎండలు ఎక్కువగా ఉంటాయి. మేఘాలు ఉన్నా, ఉక్కపోత అలాగే ఉంటుంది.
2024-04-20T00:28:33Z