మధ్యతరగతికి భారీ శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం?
భారతదేశంలో ఇప్పటికీ చాలా మంది ప్రజలకు సొంత ఇల్లు లేదు. చాలామంది అద్దెల భారాన్ని మోయలేక కష్టాలు పడుతున్నారు. ఇలాంటి వారు ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తోంది. దీని కోసం ప్రత్యేకమైన పథకాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) పరిధిని విస్తరించాలని భారత ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ పరిధిని పెంచితే ఈ పథకం ద్వారా దుకాణదారులు (Shopkeepers), వ్యాపారులు (Traders), స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు (Self-employed) సైతం ఇళ్లను కొనుగోలు చేసుకోవడానికి ఆర్థిక సహాయం పొందవచ్చు. ఈ మార్పులు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'హౌసింగ్ ఫర్ ఆల్' మిషన్లో భాగం. ప్రభుత్వం ఇంటి ధర, పరిమాణానికి అనుగుణంగా గృహ రుణ రాయితీలను అందించాలని కూడా పరిశీలిస్తోంది. ఇదే జరిగితే చాలా మందికి ఊరట లభిస్తుందని చెప్పుకపోవచ్చు. భారతదేశంలోని అందరికీ సొంత ఇంటి నిర్మాణానికి సహాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) స్కీమ్ను ప్రారంభించింది. ఈ పథకం కింద లబ్ధిదారులు గృహ రుణాలపై రాయితీలను పొందవచ్చు. "క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ (CLSS)" ద్వారా ఈ సహాయం అందుతుంది. PMAY మార్గదర్శకాల ప్రకారం, లబ్ధిదారులను మూడు వర్గాలుగా విభజించారు. వాటిలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ (EWS), లోయర్ ఇన్కమ్ గ్రూప్ (LIG), మిడిల్ ఇన్కమ్ గ్రూప్ (MIG) ఉన్నారు. ఈ పథకం ప్రారంభ లక్ష్యం 2022 మార్చి నాటికి "హౌసింగ్ ఫర్ ఆల్" అందించడం. అయితే ఈ గడువును 2024, డిసెంబర్ వరకు పొడిగించారు. బడ్జెట్లో భారీగా నిధులు కేటాయింపు. 2024 యూనియన్ బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ PMAY స్కీమ్కు కేటాయింపులను 66% పెంచి, రూ.79,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తామని ప్రకటించారు. కోవిడ్ వల్ల కొన్ని సవాళ్లు కొనసాగుతున్నా, PM ఆవాస్ యోజన (గ్రామీణ) అమలు కొనసాగుతోందని బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ‘మూడు కోట్ల ఇళ్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి మేం దగ్గరగా ఉన్నా. కుటుంబాల సంఖ్య పెరిగింది. వారి అవసరాలకు వచ్చే ఐదేళ్లలో మరో రెండు కోట్ల ఇళ్లను నిర్మించాలని నిర్ణయించుకున్నాం.’ అని వివరించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని రెండు భాగాలుగా విభజించారు. వాటిలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ ఒకటి. ఈ పథకం పట్టణ ప్రాంతాల్లో నివసించే వివిధ వర్గాలపై దృష్టి పెడుతుంది. దేశవ్యాప్తంగా 4,000కి పైగా పట్టణాలు, నగరాల్లో ఈ పథకం అమలు చేస్తున్నారు. ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి, పట్టణ ప్రాంతాల్లో ఈ పథకం పూర్తిగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం అనేది మరొకటి. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పౌరులందరికీ ఇళ్లను అందించడమే కేంద్రం లక్ష్యం. ఈ పథకం ఒక కాస్ట్-షేరింగ్ మోడల్పై ఆధారపడి ఉంటుంది, అంటే లబ్ధిదారులకు ఇళ్లు నిర్మించడానికి అయ్యే ఖర్చులను కేంద్ర ప్రభుత్వం, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి భరిస్తాయి. ఖర్చులను భాగస్వామ్యం చేసుకునే నిష్పత్తి చూసుకుంటే.. మైదాన ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వం 60% ఖర్చు భరిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 40% ఖర్చు భరిస్తుంది. ఈశాన్య, కొండ ప్రాంతాలు: కేంద్ర ప్రభుత్వం 90% ఖర్చు భరిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 10% ఖర్చు భరిస్తుంది.
2024-04-25T09:35:13Z