Rain Alert: వాతారవరణ శాఖ కీలక హెచ్చరిక.. ఈ జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు
ఓ వైపు ఎండలు దంచికొడుతుండగా.. గత రెండు మూడు రోజులుగా ఉన్నట్టుండి రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో చల్లటి వాతావరణం నెలకొంది. గత 20 రోజులుగా ఎండలు మండిపోతూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న నేపథ్యంలో తాజాగా వాతారవరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. మే నెల మొదలవ్వగానే ఎండల వల్ల నీటి ఆవిరి బాగా పెరిగి.. ఆకాశంలో మేఘాలు ఎక్కువయ్యాయి. దీంతో ఒక్కసారిగా వాతావరణంలో భారీ మార్పులు వచ్చేశాయి. తమిళనాడులో ద్రోణి ఏర్పడి అది తెలుగు రాష్ట్రాలపై చాలా బలంగా విస్తరించింది. దీంతో తెలుగు రాష్ట్రాలకు వర్షం సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 14 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వానలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్ నగరాన్ని వర్షం ముంచెత్తగా.. నేడు, రేపు అనగా శని, ఆది వారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే 24 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురుస్తాయని IMD తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కాకినాడ, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. రాయలసీమలోని చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, అనంతపురం,కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇంకో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయంటున్నారు. ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా నేడు, రేపు వర్షాలు కురిసే అవకాహలు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ లో వర్షాలతో ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా GHMC కాల్ సెంటర్ నెంబర్ 040 2111111కి కాల్ చేయవచ్చని అధికారులు చెబుతున్నారు.
2024-05-11T01:56:01Z