Tirupati Trains: వేసవి సెలవుల ఎఫెక్ట్... హైదరాబాద్ నుంచి తిరుపతికి మరిన్ని ట్రైన్స్
తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. వేసవి సెలవులు వచ్చేయడంతో తెలుగు రాష్ట్రాల భక్తులు తిరుమలకు వెళ్తున్నారు. దీంతో బస్సులు, రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే మరిన్ని స్పెషల్ ట్రైన్స్ ప్రకటించింది. కాచిగూడ నుంచి తిరుపతికి మరిన్ని స్పెషల్ ట్రైన్స్ అందుబాటులోకి వచ్చాయి. రైలు నెంబర్ 07653 కాచిగూడ నుంచి తిరుపతికి ఏప్రిల్ 25, మే 2 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు కాచిగూడలో రాత్రి 10.30 గంటలకు బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 10.10 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. రైలు నెంబర్ 07654 తిరుపతి నుంచి కాచిగూడకు ఏప్రిల్ 29, 26, మే 3 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు తిరుపతిలో రాత్రి 8.05 గంటలకు బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. కాచిగూడ-తిరుపతి, తిరుపతి-కాచిగూడ ప్రత్యేక రైళ్లు దారిలో ఉందానగర్, షాద్నగర్, మహబూబ్నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూల్ సిటీ, ఢోన్ జంక్షన్, గుత్తి జంక్షన్, ఎర్రగుంట్ల, కడప, రేణిగంట జంక్షన్లలో ఆగుతాయి. ఇప్పటికే హైదరాబాద్, తిరుపతి మధ్య మరిన్ని ట్రైన్స్ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. రద్దీని బట్టి ఎప్పటికప్పుడు ప్రత్యేక రైళ్లను ప్రకటిస్తూ ఉంటుంది భారతీయ రైల్వే. ఇక విశాఖపట్నం నుంచి తిరుపతి మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతోంది రైల్వే. రైలు నెంబర్ 08539 విశాఖపట్నం నుంచి కొల్లాం వరకు ప్రతీ బుధవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు 2024 ఏప్రిల్ 17 నుంచి 2024 జూలై 3 వరకు అందుబాటులో ఉంటుంది. విశాఖపట్నం-కొల్లాం రైలు ఉదయం 8.20 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరితే రాత్రి 9 గంటలకు రేణిగుంట చేరుకుంటుంది. రాత్రి 9.10 గంటలకు రేణిగుంటలో బయల్దేరే రైలు మరుసటి రోజు మధ్యాహ్నం 12.55 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. ఇక రైలు నెంబర్ 08540 కొల్లాం నుంచి విశాఖపట్నం వరకు ప్రతీ గురువారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు 2024 ఏప్రిల్ 18 నుంచి 2024 జూలై 4 వరకు అందుబాటులో ఉంటుంది. కొల్లాం-విశాఖపట్నం రైలు రాత్రి 7.35 గంటలకు కొల్లాంలో బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 11.55 గంటలకు రేణిగుంట చేరుకుంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు రేణిగుంటలో బయల్దేరే రైలు రాత్రి 11.20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. విశాఖపట్నం-కొల్లాం, కొల్లాం-విశాఖపట్నం ప్రత్యేక రైళ్లు దారిలో దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్పెట్టై, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొడనూర్, పాలక్కాడ్, అలువా, ఎర్నాకుళం టౌన్, కొట్టాయం, చంగనశెరి, తిరువల్ల, చెంగన్నూర్, మవెలికర రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.
2024-04-19T11:43:28Z
Tirumala Alert: శ్రీవారి భక్తులకు గమనిక... తిరుమలలో 3 రోజులు ఈ సేవలు లభించవు
తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ. ఏప్రిల్ 21వ తేదీన ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు మాడవీధులలో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేశారు. ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు. రెండవరోజు ఏప్రిల్ 22న శ్రీ భూ సమేత శ్రీ మలయప్పస్వామివారు ఉదయం 8 నుండి 10 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. చివరిరోజు ఏప్రిల్ 23న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా ప్రతి రోజు మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. కాగా ప్రతి రోజు సాయంత్రం 6 నుండి 6.30 గంటల వరకు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు. వసంత ఋతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు ఏర్పడింది. ఈ క్రతువులో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించటమే కాక వివిధ ఫలాలను కూడా నివేదించడం ఈ వసంతోత్సవంలో ప్రధాన ప్రక్రియ. వసంతోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 23న అష్టదళ పాదపద్మారాధన, ఏప్రిల్ 21 నుండి 23వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
2024-04-19T08:58:23Z