అప్పుడు ఏం జరిగిందో మీరే ఆలోచించుకోండి.. ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు లేఖ

తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు లేఖ రాశారు. ఉద్యోగులు తమ పోస్టింగ్‌లు, బదిలీల కోసం రాజకీయ నాయకుల చుట్టూ తిరగకుండా, వారి గౌరవాన్ని పెంచేందుకు రాష్ట్రంలో మొదటిసారిగా కౌన్సిలింగ్‌ విధానాన్ని టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఉద్యోగులపై పనిభారాన్ని తగ్గించేందుకు వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసిందని ప్రస్తావించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా కానిస్టేబుల్‌, ఎస్‌ఐ ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేశామన్నారు. విద్యలో నాణ్యత పెంచేందుకు 11 డీఎస్సీల ద్వారా లక్షలాది ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేసిన ఘతన తమకు దక్కుతుందన్నారు. అంగన్‌వాడీ ఉద్యోగుల జీతాలను రూ.4,200 నుంచి రూ.10,500కు పెంచిందన్నారు.

ఉద్యోగులకు పండుగ అడ్వాన్సు అందించి, ఉద్యోగ సంఘనాయకులతో స్నేహపూర్వక చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కరించిన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు బాబు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన జరిగిన అనంతరం ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉన్నప్పటికీ రాష్ట్ర భవిష్యత్‌ కోసం కష్టపడి పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులను నిరాశ పర్చకూడదని భావించామన్నారు. అందుకే 2015 వేతన సవరణలో 43% ఫిట్‌మెంట్‌ ఇచ్చామని.. రిటైర్డ్‌ ఉద్యోగులకు ఇవ్వాల్సిన అన్ని ఆర్థిక ప్రయోజనాలను ఏనాడూ వెనుకాడకుండా సకాలంలో అందించిన విషయం అందరికీ తెలుసన్నారు. ఎంతటి అర్ధిక ఇబ్బందులలో ఉన్నప్పటికీ 1వ తేదీన జీతాలు ఇవ్వడంలో ఏనాడూ వెనకాడలేదన్నారు.

గత ఐదేళ్లగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను, ఇబ్బందులను తాను కళ్లారా చూశానన్నారు చంద్రబాబు. నెలల తరబడి జీతాలు రాక, ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న ఉద్యోగ కుటుంబాల దీనగాధలు చూసి చలించిపోయానన్నారు. జీవితాంతం కష్టపడి దాచుకున్న డబ్బులు చేతికందక ఎందరో ఉద్యోగుల పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు ఆగిపోవడం వంటి కన్నీటి గాధలు, తమ హక్కుల కోసం ఉద్యమించిన వారిపై పగబట్టి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు చూసి సహించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం IR కన్నా ఫిట్‌మెంట్‌ తగ్గించి ఉద్యోగుల చరిత్రలో ఎన్నడూలేని విధంగా రివర్స్‌ పీఆర్సీ ప్రకటించిందన్నారు.

పెన్షనర్లకు అదనపు క్వాంటం పెన్షన్‌ తగ్గించి వృద్ధుల జీవితాల్లో ఆనందాన్ని దూరం చేసిందన్నారు.

వారం రోజుల్లో సీపీఎస్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఆ హామీని తుంగలో తొక్కి ఉద్యోగులను మోసగించడమే కాకుండా వారి ఆత్మహత్యలకు కారణమైందన్నారు టీడీపీ అధినేత. విద్యారంగంలో జీవో నెం.117 తీసుకువచ్చి పాఠశాలల విలీనంతో ఉపాధ్యాయ పోస్టులు రద్దుచేసి, 12,600 పాఠశాలలను ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మార్చిందని ధ్వజమెత్తారు. తద్వారా విద్యావ్యవస్థను అస్తవ్యస్తం చేసి విద్యా ప్రమాణాల స్థాయిని దిగజార్చారని.. పదవీ విరమణ ఉద్యోగులకు రావలసిన బకాయిలన్నింటినీ 2029లో చెల్లిస్తామని, పెన్షనర్లు ఎంతగానో వేచిచూసే గ్రాట్యూటీ అందుకోకుండా జీవో ఇచ్చిందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామంటూ వారిని గాలికి వదిలేసిందన్నారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అందించి, సకాలంలో జీతాలు, పెన్షన్లు, ఇతర అన్ని ఆర్థిక ప్రయోజనాలను చెల్లించే ఏర్పాటు చేస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను వైఎస్సార్‌సీపీ అవమాన పరుస్తున్నారన్నారు. తాము వచ్చాక వారి గౌరవాన్ని కాపాడుతామని.. ఉద్యోగులందరికీ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించి స్నేహపూర్వక పరిస్థితులు నెలకొల్పుతామన్నారు. నేటి అప్రజాస్వామ్య, నియంతృత్వ పాలనతో గూండాయిజం, ఫ్యాక్షనిజంతో రాష్ట్రం మళ్లీ 30 ఏళ్ళు వెనక్కివెళ్లిపోయిందన్నారు. ఒక్క ఛాన్స్‌ నినాదాన్ని నమ్మినందుకు రాష్ట్ర భవిష్యత్‌ అంధకారమైందని.. బ్రాండ్‌ ఇమేజ్‌ నాశనమైందన్నారు. రాష్ట్రం తీరని అప్పుల ఊబిలో కూరుకుపోయిందని.. అందరి కలలు సాకారం కావడానికి, రాబోయే తరాలకు మంచి భవిష్యత్‌ అందించడానికి, రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకురావడానికి కలసికట్టుగా పని చేద్దాంమన్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-04T03:38:17Z dg43tfdfdgfd