ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా ఆయనకే ఛాన్స్?.. ప్యానల్‌లో ఆ ముగ్గురు పేర్లు!

ఆంధ్రప్రదేశ్‌ ప్రస్తుత డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డిని ఎన్నికల సంఘం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తదుపరి డీజీపీ ఎవరు అనే చర్చ మొదలైంది. అయితే నూతన డీజీపీగా ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ద్వారకా తిరుమలరావు 1990 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి కాగా.. ఆయన ప్రస్తుతం సీనియార్టీ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. తిరుమలరావు తర్వాత రోడ్‌ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్, 1990 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అంజనా సిన్హా, 1991 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి మాదిరెడ్డి ప్రతాప్‌ ఉన్నారు.

కొత్త డీజీపీ నియామకం కోసం ఈ ముగ్గురి పేర్లు ప్యానల్‌ జాబితాలో పంపించే అవకాశం ఉంది తెలుస్తోంది. ఒకవేళ వీరు ముగ్గురిలో ఎవరినైనా వద్దనుకుంటే.. హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న 1992 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి హరీష్‌కుమార్‌ గుప్తా పేరు జాబితాలో చేరే అవకాశం కూడా ఉందంటున్నారు. దీనిపై త్వరగానే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏపీ నుంచి జాబితా పంపగానే ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను పూర్తి చేయనుంది.

రాజేంద్రనాథ్ రెడ్డిని సరిగ్గా పోలింగ్‌కు వారం రోజుల ముందు ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఆయన వెంటనే తన తర్వాత స్థానంలోని అధికారికి బాధ్యతలు అప్పగించేసి, డీజీపీ విధుల నుంచి రిలీవ్‌ చేయాలని ఆదేశించింది. సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఆయనకు ఎన్నికల సంబంధించిన ఎలాంటి విధులూ అప్పగించొద్దని ఎన్నికల సంఘం ఆదేశించింది.ఆయన స్థానంలో కొత్త డీజీపీ ఎంపిక కోసం..ముగ్గురు డీజీ ర్యాంకు ఐపీఎస్‌ అధికారుల పేర్లు, వివరాలతో సోమవారం ఉదయం 11 గంటల్లోగా ప్యానల్‌ జాబితా సమర్పించాలని ఆదేశించింది.

అంతేకాదు ఎన్నికల సంఘం.. గత ఐదేళ్లలో వారి ఏపీఏఆర్‌ గ్రేడింగ్‌, విజిలెన్స్‌ క్లియరెన్స్‌ల వివరాలను ప్యానల్‌తో పాటు పంపాని సీఎస్ కేఎస్‌ జవహర్‌రెడ్డిని ఆదేశించింది. అలాగే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాజేంద్రనాథరెడ్డిని బదిలీ చేస్తూ సీఎస్‌ ఉత్తర్వులిచ్చారు. 2020 ఫిబ్రవరి 15న కేవీ రాజేంద్రనాథరెడ్డిని ఇంఛార్జ్‌ డీజీపీగా నియమించారు. డీజీపీ హోదా కలిగిన 11 మంది సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను పక్కన పెట్టి మరీ రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా నియమించారు. రెండేళ్ల రెండు నెలలుగా ఆయన్ను ఇంఛార్జ్ డీజీపీగానే కొనసాగిస్తున్నారు. డీజీపీపై తెలుగుదేశం పార్టీ పలు ఫిర్యాదులు చేసింది.. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఘటనల్ని కూడా ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. అయితే చిత్తూరు జిల్లా పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్‌పై దాడి ఘటన.. అనకాపల్లిలో కూటమి అభ్యర్థి సీఎం రమేష్‌ ఎపిసోడ్‌పై ఫిర్యాదులు అందాయి.. దీంతో ఆదివారం సాయంత్రం డీజీపీ రాజేంద్రనాథ్‌ను బదిలీ చేశారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-06T00:30:26Z dg43tfdfdgfd