చంద్రబాబుకు తలనొప్పిగా మారిన అభ్యర్థి ఎంపిక.. ఆ నియోజకవర్గం నుంచి ఏడుగురి పేర్లు

ఏపీలో ఎన్డీఏ పక్షాల పొత్తులో తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ చేయనుంది. మిత్రపక్షాలైన బీజేపీ 10 అసెంబ్లీ, 6 పార్లమెంట్‌ స్థానాల్లోనూ.. జనసేన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. 2 జాబితాల్లో కలిపి తెలుగుదేశం అభ్యర్థులను ప్రకటించగా బీజేపీతో పొత్తు అనంతరం మూడు సీట్లు సర్దుబాటు చేయాల్సి వచ్చింది. అరకు అసెంబ్లీ స్థానానికి దొన్నుదొరను, పి. గన్నవరంలో మహాసేన రాజేష్‌, అనపర్తిలో నల్లిమిల్లి రామకృష్ణారెడ్డిని అభ్యర్థులుగా ఇంతకుముందే తెలుగుదేశం ప్రకటించింది. వీటితో తెలుగుదేశం ప్రకటించాల్సిన అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చింది. మొత్తం 8 అసెంబ్లీ స్థానాలు, 4 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. టీడీపీ చీపురుపల్లి, భీమిలి, పాడేరు, దర్శి, రాజంపేట, ఆలూరు, అనంతపురం అర్బన్, గుంతకల్లు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది.

ఈ పెండింగ్ నియోజకవర్గాల్లో ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే టీడీపీ కూటమి అభ్యర్థి ఎంపిక ఉత్కంఠరేపుతోంది. ఈ నియోజకవర్గంలో రోజుకో పేరు తెరపైకి వస్తోంది. దర్శి నుంచి వైఎస్సార్‌సీపీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పేరును ప్రకటించింది. ఆయనకు ధీటైన అభ్యర్థిని బరిలోకి దించాలని టీడీపీ కసరత్తు చేస్తోంది. ఈ రేసులో జిల్లాకు చెందిన శ్రీహర్షిణీ విద్యాసంస్థల అధినేత గోరంట్ల రవికుమార్‌, మాజీ ఎమ్మెల్యే గరటయ్య కుమారుడు కృష్ణచైతన్య, మాజీ ఎమ్మెల్యే దివంగత నరసయ్య కుమార్తె కె.లక్ష్మి, జనసేన నాయకుడు గరికపాటి వెంకట్‌ టికెట్‌ ఆశిస్తున్నారు.

వీరితో పాటుగా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి తనయుడు మాగుంట రాఘవ్‌రెడ్డి, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్లను కూడా టీడీపీ అధిష్టానం పరిశీలించినట్లు తెలుస్తోంది. తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది.. దర్శి సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ పేరుతోనూ ఐవీఆర్‌ సర్వే చేపట్టారు. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున మద్దిశెట్టి ఇక్కడ గెలుపొందారు. అనంతరం ప్రభుత్వం, సొంత పార్టీపై విమర్శలు చేశారు.. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో కూడా విభేదాలు వచ్చాయి. వేణును కాదని బూచేపల్లికి టికెట్ కేటాయించారు.. దీంతో ఆయన సైలెంట్ అయ్యారు. తాజాగా మద్దిశెట్టి పేరుతో ఐవీఆర్ సర్వే చేయడం చర్చనీయాంశమైంది.

దర్శి సీటులో మొదటి నుంచి టీడీపీలో గందరగోళం కొనసాగింది. 2019 ఎన్నికల తర్వాత దర్శి నియోజకవర్గానికి ఇంఛార్జ్ లేకుండాపోయారు. పమిడి రమేష్‌కు టీడీపీ ఇంఛార్జ్ బాధ్యతల్ని అప్పగించింది.. అయితే ఆయన అనూహ్యంగా ఆ పదవి నుంచి తప్పుకున్నారు. అప్పటి నుంచి కొత్తగా ఎవరికీ అక్కడ బాధ్యతలు అప్పగించారు. అయితే గతేడాది దర్శి టికెట్ జనసేన పార్టీకి కేటాయిస్తారని చర్చ జరిగింది. . కానీ మళ్లీ టీడీపీకే ఆ సీటు కేటాయించిన పరిస్థితి.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-03-29T06:26:56Z dg43tfdfdgfd