చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగత తెలిసిందే. అయితే ఈ బెయిల్‌ను రద్దుచేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. ప్రధానంగా 17ఏ అంశానికి సంబంధించి త్రిసభ్య ధర్మాసనానికి ప్రతిపాదించిన కేసు పెండింగ్‌లో ఉందని.. దానిపై నిర్ణయం తీసుకోలేదని విచారణలో ఏపీ సీఐడీ తరఫున సీనియర్‌ లాయర్ రంజిత్‌కుమార్‌ కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో ఆ అంశం తేలాక ఈ కేసును విచారణకు స్వీకరిస్తామని జస్టిస్‌ త్రివేది అన్నారు. ఆ విషయాన్ని తాము కోర్టుకే వదిలిపెడుతున్నామన్నారు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థలూథ్రా. ఈ కేసులో ఇప్పటికే ఛార్జిషీటు దాఖలైందని తెలిపారు.

సెక్షన్‌-17ఏ కింద ఏపీ ప్రభుత్వం అనుమతి తీసుకోనందున కోర్టు ఆ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోలేదని లూథ్రా ధర్మాసనానికి తెలిపారు. తమకు 17ఏ ఆధారంగా బెయిల్‌ ఇవ్వలేదన్న అంశాన్ని ప్రస్తావించారు.. ఆ అంశంపై సుప్రీంకోర్టు నిర్ణయం వెలువరించక ముందే హైకోర్టు బెయిల్‌ మంజూరుచేసిన విషషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు 52 రోజులు జైల్లో ఉండి వచ్చిన తర్వాత ఛార్జిషీట్‌ దాఖలు చేశారని.. అలాగే ప్రస్తుతం దాని పరిస్థితి ఏంటో రాష్ట్ర ప్రభుత్వమే చెప్పాలన్నారు లూథ్రా. అంతేకాదు 17ఏపై త్రిసభ్య ధర్మాసనం నిర్ణయం వెల్లడించే వరకు ఈ కేసును తాత్కాలికంగా వాయిదా వేస్తామని జస్టిస్‌ త్రివేది తెలిపారు.

కేసు ఇంకా పెండింగ్‌లో ఉందని.. ఛార్జిషీట్‌కు సీఆర్‌పీసీ 173(8) అనుమతి తీసుకున్నట్లు ప్రభుత్వ లాయర్ రంజిత్‌కుమార్‌ కోర్టుకు చెప్పారు. ప్రభుత్వం దర్యాప్తు కొనసాగిస్తోందని .. 17-ఏ అంశాన్ని తాము జులైలో మెన్షన్‌ చేస్తామన్నారు రంజిత్ అన్నారు. రాష్ట్రప్రభుత్వం ఈ కేసును దర్యాప్తు చేస్తోందని సీఐడీ తరఫు లాయర్ చెబుతున్నారని.. అదే తమకు సమస్య అని చంద్రబాబు తరఫు లాయర్ సిద్ధార్థ లూథ్రా అన్నారు. దర్యాప్తు అధికారి ఈ మేరకు వివరణ ఇచ్చారని ప్రభుత్వ తరఫు లాయర్ రంజిత్‌కుమార్‌ చెప్పగా.. లూథ్రా మాత్రం విభేదించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో తాము పేర్కొన్న అభిప్రాయాలేవీ విచారణకు అడ్డుకావన్నారు లూథ్రా. అలాగే దర్యాప్తు సంస్థ విచారణ కొనసాగించుకోవచ్చని చెప్పిందని ఆయన గుర్తుచేశారు.

ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్‌ త్రివేది కేసును 10 వారాలకు వాయిదా వేస్తామన్నారు. అలాగే ఈ పిటిషన్‌పై తక్షణం విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని తాము భావించడం లేదన్నారు. అందుకే వేసవి సెలవుల తర్వాత వాదనలు వింటామని త్రివేది తెలిపారు. అలాగే 17ఏ కేసును త్రిసభ్య ధర్మాసనం ముందు లిస్ట్‌ చేయడంపై ప్రభుత్వ తరఫు లాయర్ స్పందించారు. ఈ విషయాన్ని తాము సెలవుల తర్వాత సీజేఐ ధర్మాసనం ముందు మెన్షన్‌ చేస్తామని లాయర్ రంజిత్‌కుమార్‌ అన్నారు. 17ఏ అంశంపై త్రిసభ్య ధర్మాసనం నిర్ణయం వెల్లడించిన తర్వాత దీన్ని పరిశీలిస్తామని చెప్పింది జస్టిస్‌ త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ ధర్మాసనం. దీంతో ఈ పిటిషన్‌పై విచారణను 10 వారాలకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-08T00:52:49Z dg43tfdfdgfd