తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ గుడ్న్యూస్.. దర్శనానికి సంబంధించి వచ్చే నెల వరకు అద్భుత అవకాశం
తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందిస్తున్నామంటోంది టీటీడీ. వేసవి కాలం కావడంతో ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈవో ధర్మారెడ్డి. ఇవాళ జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. వేసవి రద్దీ, ఇతర పండుగల దృష్ట్యా మే నెలలో భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ సిద్ధంగా ఉందన్నారు ఈవో. వేసవి సెలవుల్లో రద్దీని దృష్టిలో ఉంచుకుని వీఐపీ బ్రేక్ దర్శనం కోసం సిఫార్సు లేఖలను రద్దు చేసినట్లు తెలిపారు. వీఐపీ బ్రేక్ దర్శనాలు కేవలం ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే పరిమితం చేశామన్నారు.
తిరుమలలో వేసవి ఏర్పాట్లు
వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టామన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు, అల్పాహారం, వైద్య సౌకర్యాలను అందిస్తున్నట్లు తెలిపారు. ఆలయ మాడ వీధుల్లో, భక్తుల సంచారం ఎక్కువగా ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ, ఎండ వేడి నుండి ఉపశమనం కల్పించేందుకు చలువపందిళ్లు, చలువసున్నం, కార్పెట్లు ఏర్పాటు చేశాం. నేలపై నీళ్లతో ఎప్పటికప్పుడు తడుపుతున్నట్లు తెలిపారు. నారాయణగిరి ఉద్యానవనాలు, ఆలయ పరిసరాల్లో భక్తులు సేద తీరేందుకు తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశామన్నారు.
జూన్ 1 నుంచి 5వ తేదీ వరకు హనుమత్ జయంతి ఉత్సవాలు
తిరుమలలోని ఆకాశగంగ వద్ద ఉన్న శ్రీ బాలాంజనేయస్వామివారి ఆలయంలో జూన్ 1 నుండి 5వ తేదీ వరకు ఐదు రోజుల పాటు హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామన్నారు ఈవో ధర్మారెడ్డి. జూన్ 1న శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి విశేషంగా తిరుమంజనం, 7వ మైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామివారికి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. హనుమత్ జయంతి సందర్భంగా ఆకాశగంగ వద్ద ఉన్న శ్రీ బాలాంజనేయస్వామివారికి విశేష అభిషేక, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు ఈవో.
హనుమంతుని జన్మ విశేషాలు, ఇతర అంశాలను ఆధ్యాత్మికపరంగానే కాకుండా వైజ్ఞానిక కోణంలో కూడా ప్రముఖ పండితులతో ప్రసంగాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా తిరుమలలోని అంజనాద్రి, ఆకాశగంగ, నాదనీరాజనం వేదికలపై అన్నమాచార్య, దాససాహిత్య, హిందూ ధర్మప్రచార పరిషత్ కళాకారులతో ఆధ్యాత్మిక, భక్తిసంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో జూన్ 2న ఉదయం సూర్యోదయంతో సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం ప్రారంభమవుతుంది. సుందరకాండలోని మొత్తం 2,872 శ్లోకాలను వేద పండితులు పారాయణం చేస్తారని తెలిపారు.
టీటీడీ విద్యాసంస్థల్లో ఉత్తమ ఫలితాలు
టీటీడీ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా విద్య, వైద్యరంగాల్లో ఇతోధిక సేవలు అందిస్తోందన్నారు ఈవో ధర్మారెడ్డి. ఇటీవల విడుదలైన ఇంటర్, పదో తరగతి పరీక్ష ఫలితాల్లో టీటీడీ కళాశాలలు, ఉన్నత పాఠశాలలు 98 శాతం ఫలితాలు సాధించాయని తెలిపారు. ప్రత్యేక తరగతుల నిర్వహణ, చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో ఈ ఫలితాలు సాధ్యమయ్యాయన్నారు. ఇందుకు కృషి చేసిన జేఈవో, డీఈవో, ప్రిన్సిపాళ్లు, హెడ్మాస్టర్లు ఇతర బోధనా సిబ్బందిని అభినందించారు.
టీటీడీ చేస్తున్న సేవలను అభినందించిన రాష్ట్ర గవర్నర్
టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బర్డ్, శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రులను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఏప్రిల్ 26వ తేదీ సందర్శించిన విషయాన్ని ఈవో ధర్మారెడ్డి గుర్తు చేశారు. బర్డ్లో నిరుపేదలకు ఉచితంగా మోకాలి కీళ్ల మార్పిడి, ఇతర ఎముకల సంబంధిత వ్యాధులకు అందిస్తున్న చికిత్స, శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రిలో ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు చేసి చిన్నారులకు టీటీడీ అందిస్తున్న సేవల పట్ల రాష్ట్ర గవర్నర్ అభినందించారన్ననారు. ఒక ఏడాదిలో 14 గుండె మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించి రికార్డు సృష్టించినట్లు ఈవో తెలిపారు. అదేవిధంగా ఇప్పటి వరకు 2500కు పైగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించామన్నారు.
మొట్ట మొదటిసారిగా బెంగుళూరుకు చెందిన ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థిని కుమారి కీర్తన 10 లక్షల ఒక వెయ్యి 116 సార్లు ‘‘గోవింద కోటి’’ని రాసినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. శ్రీవారి అనుగ్రహంతో కుమారి కీర్తన ఉజ్వల భవిష్యత్ పొందాలని స్వామివారిని ప్రార్థిసున్నానన్నారు.
శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు
* మే 17 నుంచి 19వ తేదీ వరకు తిరుమలలో శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు.
* మే 22న తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి ఉత్సవాలు నిర్వహణ
* తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 21 నుంచి 23వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాల నిర్వహణ
* మే 22న ఉదయం 7.45 గంటల నుంచి అమ్మవారి బంగారు రథోత్సవం జరుగుతుంది.
* మే 23న తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో పత్ర పుష్పయాగం
* మే 23న శ్రీతాళ్ళపాక అన్నమయ్య జయంతి ఉత్సవాలను తాళ్ళపాక, తిరుపతిలలో ఘనంగా నిర్వహిస్తారు
* శ్రీనివాసమంగాపురం శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మే 27 నుంచి 29వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు
* మే 28న సాయంత్రం 6 గంటల నుంచి స్వామి, అమ్మవార్లు బంగారు రథంపై విహరించి భక్తులకు దర్శనం ఇస్తారు.
ఇటువంటి మరిన్ని
వార్తలు సమయం తెలుగులో చదవండి.
లేటెస్ట్ వార్తలు,
సిటీ వార్తలు,
జాతీయ వార్తలు,
బిజినెస్ వార్తలు,
క్రీడా వార్తలు,
రాశిఫలాలు ఇంకా
లైఫ్స్టైల్ అప్డేట్లు మొదలగునవి తెలుసుకోండి.
వీడియోలను TimesXP లో చూడండి.
2024-05-03T08:50:10Z dg43tfdfdgfd