ARVIND KEJRIWAL: ఢిల్లీ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరటనిచ్చే వార్త.. ఎన్నికల వేళ బెయిల్?

Arvind Kejriwal: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు.. ఎన్నికల వేళ బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయా. తాజాగా కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను పరిగణలోకి తీసుకుంటామని సుప్రీంకోర్టు తాజాగా చెప్పడం ఈ కేసులో కీలకంగా మారింది. లోక్‌సభ ఎన్నికల వేళ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై ఇరు వర్గాల వాదనలు వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే విచారణ జరిపిన తర్వాత కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేయవచ్చు లేదా మంజూరు చేయకపోవచ్చు అని కూడా పేర్కొంది. దీనిపై అటు కేజ్రీవాల్ తరఫు న్యాయవాది గానీ.. ఇటు ఈడీ తరఫు న్యాయవాది గానీ ఆశ్చర్యపోనక్కర్లేదని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది.

ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై విచారణకు సంబంధించి వాదనలకు సిద్ధంగా ఉండాలని ఈడీ తరఫు న్యాయవాదికి సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం సూచించింది. ప్రస్తుతం దేశంలో ఎన్నికల నేపథ్యంలో అరవింద్‌ కేజ్రీవాల్ ‌మధ్యంతర బెయిల్‌ను పరిగణనలోకి తీసుకుంటామని సుప్రీంకోర్టు శుక్రవారం వెల్లడించింది. ఈ నెల 7 వ తేదీన కేజ్రీవాల్ బెయిల్ అంశంపై విచారణ జరుపుతామని ఈడీకి తెలిపింది. కేజ్రీవాల్‌ బెయిల్‌ అంశంపై సిద్ధంగా ఉండాలని ఈడీ న్యాయవాదికి సూచించింది.

అయితే విచారణ జరిపిన తర్వాత కేజ్రీవాల్‌కు.. ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్‌ ఇచ్చినా ఇవ్వకున్నా ఇరు వర్గాలు ఎలాంటి ఆశ్చర్యానికి గురికావద్దని అని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా బెంచ్ స్పష్టం చేసింది. ఢిల్లీ మద్యం కేసులో అరవింద్ కేజ్రీవాల్ బెయిల్‌ అంశంపై ఇరువర్గాల వాదనలు వింటామని కోర్టు తేల్చి చెప్పింది. ఈడీ అరెస్టుకు వ్యతిరేకంగా కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణ జరిపేందుకు సమయం పట్టే అవకాశం ఉందని.. అందుకే మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరుపుతామని కోర్టు వెల్లడించింది.

అయితే కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను తాము వ్యతిరేకిస్తామని ఈడీ తరఫు లాయర్ అడిషినల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు కోర్టుకు తెలిపారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ధర్మాసనం.. కేవలం బెయిల్ పిటిషన్‌పై విచారణ మాత్రమే చేస్తామని చెప్పామని.. కానీ బెయిల్ ఇస్తామని ఖచ్చితంగా చెప్పలేదని తెలిపింది. వాదనలు విన్న తర్వాత బెయిల్‌ ఇవ్వొచ్చు, ఇవ్వకపోవచ్చని వ్యాఖ్యానించింది. విచారణకు రెండు వర్గాలు సిద్ధమై రావాలని సుప్రీంకోర్టు సూచించింది. ఒకవేళ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరైతే ఆయనకు విధించే షరతులు, సీఎంగా ఏ ఫైళ్లపై సంతకం చేయాలి.. ఏ ఫైళ్లపై సంతకాలు చేయవద్దు అనే విషయాలను పరిశీలించాలని ఈడీకి సుప్రీంకోర్టు సూచించింది.

ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో మార్చి 21 వ తేదీన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజులు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచుకున్న తర్వాత ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలతో తీహార్ జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్‌ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక ప్రస్తుతం దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తనకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయాలని కోర్టును విజ్ఞప్తి చేశారు. అయితే ఈ పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని ఏప్రిల్‌ 15 వ తేదీన ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-03T14:30:43Z dg43tfdfdgfd