ARVIND KEJRIWAL: లాయర్‌గా మారిన ఢిల్లీ సీఎం.. తన కేసును తానే వాదించుకున్న కేజ్రీవాల్

Arvind Kejriwal: లోక్‌సభ ఎన్నికలకు ముందు దేశంలో ఢిల్లీ లిక్కర్ కేసు సంచలనంగా మారింది. 2 ఏళ్లుగా సాగుతున్న ఈ కేసు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఢిల్లీ సీఎం అరవిందే కేజ్రీవాల్ అరెస్ట్‌తో కేసులో వేగం పెరిగింది. ఈ క్రమంలోనే ఈ నెల 21 వ తేదీన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్‌కు 7 రోజుల ఈడీ కస్టడీ విధించింది. అది గురువారంతో పూర్తి కావడంతో మరోసారి 4 రోజులపాటు కస్టడీని పొడగించింది. ఈ సందర్భంగా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో జరిగిన విచారణలో భాగంగా తన కేసు గురించి కేజ్రీవాల్ తానే వాదించుకున్నారు.

ఈ సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌-ఈడీపై కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆమ్ ఆద్మీ పార్టీని అణిచివేసేందుకు ఈడీ ప్రయత్నిసోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో రూ.100 కోట్ల అవినీతి జరిగిందని ఈడీ చెబుతోందని.. మరి ఆ రూ.100 కోట్లు ఎక్కడికి పోయాయని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఈ కేసులో తనను అరెస్ట్‌ చేసేందుకు తగిన ఆధారాలు ఈడీ వద్ద లేవని తెలిపారు. ఏ కోర్టు కూడా తనను దోషిగా పరిగణించలేదని కేజ్రీవాల్ కోర్టు ముందు వాదించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ దాఖలు చేసిన 31 వేల పేజీల ఛార్జిషీట్‌లో, ఈడీ దాఖలు చేసిన 25వేల పేజీల ఛార్జిషీట్‌లో ఎక్కడా తన పేరు లేదని కేజ్రీవాల్ తెలిపారు. అయినా తనను ఎందుకు అరెస్ట్‌ చేశారని కేజ్రీవాల్ ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే తనను ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో ఇరికించడమే లక్ష్యంగా ఈడీ అధికారులు ప్రవర్తిస్తున్నారని కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన మాగుంట రాఘవరెడ్డి ఇచ్చి 7 స్టేట్‌మెంట్లలో 6 స్టేట్‌మెంట్లలో తన పేరు లేదని చెప్పారు. శరత్‌ చంద్రారెడ్డి అరెస్ట్‌ తర్వాత రూ. 55 కోట్లు ఎలక్టోరల్‌ బాండ్స్‌ ద్వారా బీజేపీకి ఇచ్చాడని ఈ సందర్భంగా కేజ్రీవాల్ గుర్తు చేశారు. శరత్ చంద్రారెడ్డితో బలవంతంగా తన పేరు చెప్పించారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఈడీ అధికారులకు రెండు లక్ష్యాలు ఉన్నాయని పేర్కొన్న కేజ్రీవాల్.. అందులో ఒకటి తనను ఈ కేసులో ఇరికించడం.. రెండోది ఆప్‌ను లేకుండా చేయడమేనని కోర్టు ముందు చెప్పారు.

ఇక ఈ కేసులో మరో 7 రోజులపాటు కేజ్రీవాల్‌ను కస్టడీకి ఇవ్వాలని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టును ఈడీ కోరింది. రెండు వైపులా వాదనలు విన్న కోర్టు.. కేజ్రీవాల్‌ కస్టడీని మరో నాలుగు రోజులు పొడిగిస్తూ తీర్పు వెల్లడించింది. దీంతో ఏప్రిల్‌ 1 వ తేదీ వరకు కేజ్రీవాల్‌ ఈడీ కస్టడీలో ఉండనున్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-03-28T13:05:45Z dg43tfdfdgfd