CHAI PE CHARCHA: మోదీ-బిల్‌గేట్స్ చాయ్ పే చర్చా.. ఏమేం మాట్లాడుకున్నారంటే?

Chai Pe Charcha: భారత పర్యటనకు వచ్చిన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. వీరిద్దరి మధ్య జరిగిన చాయ్ పే చర్చలో.. కీలక విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పటికే తన భారత పర్యటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్న బిల్‌గేట్స్.. తాజాగా ప్రధాని మోదీతో భేటీ అయిన వీడియోను కూడా విడుదల చేశారు. దాదాపు 45 నిమిషాల పాటు ఉన్న ఆ వీడియోలో ప్రస్తుత టెక్నాలజీ.. సహా దేశంలోని వివిధ అంశాలపై మోదీ, గేట్స్ చర్చించారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి డిజిటల్ రివల్యూషన్ వరకు అనేక అంశాలపై సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంగా భారత్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను బిల్‌గేట్స్‌కు ప్రధాని మోదీ వివరించారు.

మన దేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ, టీకా, టెక్నాలజీ, నారీ శక్తి, వాతావరణ మార్పుల గురించి చర్చించారు. ఈ క్రమంలోనే గత ఏడాది భారత్‌లో జరిగిన జీ 20 శిఖరాగ్ర సదస్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఏ విధంగా ఉపయోగించారో ప్రధాని వివరించారు. ఇక కాశీ తమిళ సంగమం కార్యక్రమంలో తాను చేసిన హిందీ ప్రసంగాన్ని తమిళంలోకి ఏఐ ద్వారా ఎలా అనువదించారు అనే విషయాలను కూడా నరేంద్ర మోదీ ప్రస్తావించారు. మరోవైపు డీప్‌ఫేక్‌ వీడియోల కోసం ఏఐని దుర్వినియోగం చేయడం పట్ల ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

దేశంలో రోజురోజుకూ డీప్ ఫేక్ వీడియోల కారణంగా ఎదురవుతున్న సమస్యలు, ప్రతికూల ప్రభావాలను తగ్గించేందుకు ఇప్పటికే చర్యలను ప్రారంభించినట్లు మోదీ తెలిపారు. సరైన ట్రైనింగ్ లేకపోతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజనెన్స్ దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని మోదీ వ్యక్తం చేశారు. ఎవరూ తప్పుదోవ పట్టకుండా ఉండటానికి మనం ఏఐ కంటెంట్‌ను వాటర్‌మార్కింగ్ చేస్తూ ఉపయోగించాలని ప్రధాని మోదీ ఈ సందర్భంగా హితవు పలికారు. భారత్‌ లాంటి ప్రజాస్వామ్య దేశంలో డీప్‌ఫేక్‌ను ఎవరైనా వినియోగించవచ్చని.. డీప్‌ఫేక్‌తో తన వాయిస్‌ను కూడా ఇమిటేట్ చేసినట్లు తెలిపారు.

ఏఐ వినియోగించడంలో ప్రస్తుతం మనం ప్రారంభదశలోనే ఉన్నామని బిల్‌గేట్స్ చెప్పారు. మనం కష్టం అనుకున్న పనులను ఏఐ సులువుగా చేస్తుందని.. సులువు అనుకున్న వాటిలో విఫలం అవుతోందని పేర్కొన్నారు. ఏఐ అనేది చాలా పెద్ద అవకాశమని.. అదే సమయంలో దానితో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయని అన్నారు.

బిల్‌గేట్స్‌తో జరిగిన భేటీలో ఇండియన్ ఎకానమీ గురించి మోదీ ప్రస్తావించారు. భార‌త ఆర్థిక వ్యవస్థ నిరంతరం అభివృద్ధి చెందుతోంద‌ని.. దేశం మొత్తం డిజిట‌ల్ విప్లవాన్ని అవలంభిస్తోందని మోదీ తెలిపారు. భారత్‌లో కరోనా కాలంలో ప్రజలు కోవిన్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో వ్యాక్సినేషన్ కోసం బుక్ చేసుకోవడం, అపాయింట్‌మెంట్ తీసుకున్నారని బిల్‌గేట్స్‌కు వివరించారు. దీంతో కరోనా సమయంలో డిజిటల్ రంగం ప్రజల పనిని చాలా సులభం చేసిందని వెల్లడించారు.

ఇక భారత ఆరోగ్య రంగం గురించి వెల్లడించిన ప్రధాని.. దేశంలోని అనేక గ్రామాల్లో 2 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు నిర్మించినట్లు చెప్పారు. ఈ ఆరోగ్య కేంద్రాలను అత్యాధునిక టెక్నాలజీతో హాస్పిటల్స్‌తో అనుసంధానం చేశామన్నారు. వీటిని ఆధునికంగా, శాస్త్రీయంగా మార్చేందుకు డ్రోన్ దీదీ పథకాన్ని కూడా ప్రారంభించామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా గ్రామాలకు మౌలిక సదుపాయాలను తీసుకువెళ్లామని.. దేశంలోని మహిళలు కొత్త టెక్నాలజీని వేగంగా స్వీకరించారని ప్రధాని మోదీ చెప్పారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-03-29T12:38:01Z dg43tfdfdgfd