CHITTOOR DISTRICT POLITICAL FAMILES : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాజకీయ వారసుల హవా - వారసులు కాని యువనేతలకు ఏదీ చాన్స్ ?

Chittor Politics :   ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాజకీయాలు కొన్ని కుటుంబాలే తరతరాలుగా వస్తున్నాయి. తాతల కాలం నుంచి ఇప్పటి వరకు వారి వారసులే ఏ ఎన్నికలు జరిగినా పోటీ పడుతున్నారు. కొందరు అధికారం ఉన్న లేకపోయిన ప్రజలతో ఉండగా మరికొందరు అధికారం ఎటువైపు ఉంటే ఆ వైపు వెళ్ళిపోతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి.  

తిరుపతి

తిరుపతి సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం లో ఎమ్మెల్యే గా గెలుపొంది టీటీడీ చైర్మన్ గా పని చేసారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొంది మరో సారి టీటీడీ చైర్మన్ గా పని చేస్తున్నారు. 2024 ఎన్నికలకు తన కుమారుడు భూమన అభినయ్ రెడ్డి ను గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. అభినయ్ ఇప్పటికే తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ గా ఉన్నారు. 

చంద్రగిరి

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి జడ్పీటీసీ స్థాయి నుంచి వచ్చారు. వైసీపీ పార్టీ లో చేరి 2014, 2019లో ఎమ్మెల్యే గా గెలుపొందారు. తుడా ఛైర్మన్ తో పాటు ప్రభుత్వ విప్ గా, టీటీడీ ఎక్స్ అఫీసిషియో సభ్యుడుగా పని చేసారు. ఆయన కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎంపీపీగా గెలిచి కుడా ఛైర్మన్ గా పని చేసారు. ప్రస్తుతం చంద్రగిరి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీ చేస్తున్నారు.

శ్రీకాళహస్తి

శ్రీకాళహస్తి లో టీడీపీ అభ్యర్థి గా బరిలో ఉన్న బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి. ఆయన తాత బొజ్జల గంగసుబ్బరామిరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తరువాత ఆయన తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఐదు సార్లు ఎమ్మెల్యేగా, మూడు సార్లు మంత్రిగా పనిచేసారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలై మరోసారి తన ఆధిపత్యం కోసం కృషి చేస్తున్నారు.

నగరి

నగరి టీడీపీ అభ్యర్థి గా పోటీ చేస్తున్న గాలి భాను ప్రకాష్ తండ్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు. ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాలోకి వచ్చి 6 సార్లు ఎమ్మెల్యేగా పని చేయడంతో పాటు మంత్రిగా మూడు సార్లు, ఎమ్మెల్సీగా పని చేసారు. ఆయన కుమారుడు గాలి భాను తన సత్తా చాటాలని చూస్తున్నారు.

కుప్పం

కుప్పం నియోజకవర్గం లో గత ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై పోటీ చేసి ఓటమిపాలైన మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళీ మరణాంతరం ఆయన కుమారుడు కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ 2021లో ఎమ్మెల్సీ అయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి గా వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు.

జీడీ నెల్లూరు

ఈ నియోజకవర్గం నుంచి కె. నారాయణ స్వామి 2004లో 2014, 2019లో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఉప ముఖ్యమంత్రి, మంత్రి గా పని చేసారు. ఆయన కుమార్తె కృపాలక్ష్మి ను ఈ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి పోటీ చేస్తుంది.

పలమనేరు

టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు మాజీ మంత్రి ఎన్. అమర్నాథ్ రెడ్డి. ఆయన తండ్రి రామకృష్ణ రెడ్డి ద్వారా రాజకీయాలలోకి వచ్చి సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే గా 4 సార్లు గెలుపొంది మంత్రిగా పని చేసారు.

పీలేరు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి గా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు, తండ్రి మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, తల్లి సరోజమ్మ ఎమ్మెల్యే లుగా పని చేసారు. గత రెండు ఎన్నికల్లో ఓటమి పాలై. టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి.

తంబళ్లపల్లె

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడిగా రాజకీయాల్లోకి వచ్చిన పెద్దిరెడ్డి ద్వారకానాథ రెడ్డి 2019లో ఎమ్మెల్యే గా గెలుపొందారు. మరోసారి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

ఇక సత్యవేడు, చిత్తూరు, పుంగనూరు, పూతలపట్టు, మదనపల్లి నియోజకవర్గాలలో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు సొంతంగా ఎలాంటి కుటుంబ రాజకీయ నేపథ్యం లేకుండా ఎన్నికల్లో నిలిచారు.

ఇలా అత్యధిక మంది వారసత్వంగానే రాజకీయాల్లోకి వస్తున్నారు. కింది నుంచి ఎదుగుతున్న వారికి రాజకీయ పార్టీల్లో పెద్దగా అవకాశాలు లభించడం లేదు. భాను ప్రకాష్ రెడ్డి, కిరణ్ రాయల్ వంటి వారు ప్రయత్నాలు చేస్తున్నా నిరాశే ఎదురవుతోంది. 

2024-04-26T08:43:34Z dg43tfdfdgfd