CM YS JAGAN: చంద్రబాబును నమ్మడమంటే పులి నోట్లో తలపెట్టినట్టే- తాడిపత్రి సభలో సీఎం జగన్

Cm Ys Jagan Setairs On Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును నమ్మడం అంటే.. పులి నోట్లో తలపెట్టినట్టేనని సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని ఆయన సూచించారు. ఆదివారం మధ్యాహ్నం తాడిపత్రిలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబును నమ్మడం అంటే.. చంద్రముఖిని నిద్ర లేపినట్టేనని వ్యాఖ్యానించారు. ఎన్నికల యుద్ధానికి తాడిపత్రి సిద్ధమేనా అని జగన్ కేడర్ ను ప్రశ్నించారు.

ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు 

రానున్న ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలను ఎన్నుకునేవి మాత్రమే కాదని, వచ్చే ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని జగన్ స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు జెండాలు జతకట్టుకొని వస్తున్నాయని, జగన్ ఒంటరిగా ప్రజలను నమ్ముకుని వస్తున్నాడని వెల్లడించారు. మీ జగన్కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగించేందుకు అవకాశం ఉంటుందని.. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే మాత్రం పథకాలకు ముగింపేననీ పేర్కొన్నారు. చంద్రబాబుకు ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇవ్వడం అలవాటేనన్న జగన్.. తాను మాత్రం ఆచరణ సాధ్యమైన హామీలను మాత్రమే ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.

మేనిఫెస్టేను భగవద్గీత, ఖురాన్, బైబిల్ గా తాను భావిస్తానని, గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99% అమలు చేసినట్లు జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. గడిచిన ఐదేళ్లలో 2.70 లక్షల కోట్ల నగదు నేరుగా ప్రజల ఖాతాల్లోకి జమ చేశామని, ఎక్కడా లంచాలు, వివక్షకు తావు లేకుండా పాలన సాగించామని స్పష్టం చేశారు. 58 నెలల కాలవ్యవధిలో 2.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వాన్ని స్పష్టం చేశారు. 

విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం

గడిచిన ఐదేళ్ల పాలనలో విపులవాత్మకమైన మార్పులు తీసుకువచ్చినట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. పౌరు సేవల్లో అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చామని, వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను నూతనంగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రతి గ్రామం, పట్నంలో సచివాలయాలు ఏర్పాటు చేశామన్నారు. రైతు భరోసా కేంద్రం ద్వారా గ్రామాల్లోనే రైతులకు మేలు కలిగిస్తున్నామన్నారు. ఇంటి వద్దకే రేషన్ తీసుకువచ్చే సౌలభ్యాన్ని కల్పించామని, మీ బిడ్డ జగన్ పాలనలో ఇంటికే వైద్య సేవలు అందుతున్నాయి అన్నారు. మళ్లీ మీ బిడ్డ జగన్ ప్రభుత్వమే వస్తే.. ప్రజల జీవితాలు మరింత బాగుపడతాయి అన్నారు.

నాడు నేడు పథకంలో భాగంగా స్కూళ్ళ రూపు రేఖలను మార్చేశామని, టాప్ యూనివర్సిటీలతో డిగ్రీ కాలేజీలను అనుసంధానం చేశామని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. మరో 15 ఏళ్లపాటు ఇలాంటి పాలన సాగితే.. ప్రజల జీవితాల్లో మార్పులు సాధ్యమవుతుందన్నారు. గతంలో ఎప్పుడూ చూడని మహిళా సాధికారతను గడిచిన ఐదేళ్లలోనే చూసామన్న జగన్.. 50% రిజర్వేషన్లు అమలు చేసి నామినేటెడ్ పదవులు కూడా కల్పించామన్నారు. మహిళల పేరుతోనే 31 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేశామని సీఎం వివరించారు. 80% ఉద్యోగాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఇచ్చామని, అసెంబ్లీ పార్లమెంటు స్థానాల్లో సగం స్థానాలను మహిళకే కేటాయించామన్నారు. 

మోసాలు.. కుట్రలు నమ్ముకొని చంద్రబాబు రాజకీయం

40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు.. మోసాలు కుట్రలను నమ్ముకుని రాజకీయం చేస్తున్నాడని సీఎం జగన్ విమర్శించారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే ఒక్క పథకం అయినా ఉందా..? అని ఈ సందర్భంగా జగన్ ప్రశ్నించారు. ముఖ్యమైన హామీలతో చంద్రబాబు సంతకం పెట్టి ఇదే కూటమి గతంలో ప్రజలను మోసం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా జగన్ గుర్తు చేశారు. రుణమాఫీ అంటూ చంద్రబాబు రైతులను మోసం చేశారని, డ్వాక్రా రుణాల పేరుతో మహిళలను దగా చేశాడన్నారు. ఆడపిల్ల పుట్టగానే బ్యాంకుల్లో 25000 డిపాజిట్ చేస్తానన్న చంద్రబాబు మాట నిలబెట్టుకున్నారా అని ఈ సందర్భంగా జగన్ ప్రశ్నించారు.

ఇప్పుడు సూపర్ సిక్స్ అంటూ హామీల పేరుతో మరో డ్రామాకు చంద్రబాబునాయుడు తెరతీసారని, సంక్షేమ పాలన కొనసాగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని ఈ సందర్భంగా జగన్ ప్రజలను కోరారు. తాడిపత్రి ఎమ్మెల్యేగా కేతిరెడ్డి పెద్దారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని, అనంతపురం ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణను అఖండ మెజారిటీతో పార్లమెంటుకు పంపించాలని కోరారు. ప్రజలకు మంచి చేసిన జగన్ వెంట ఉండాలని ఆయన మరో మారు విజ్ఞప్తి చేశారు.

2024-04-28T09:40:22Z dg43tfdfdgfd