HELICOPTER CRASH: ఎన్నికల వేళ కుప్పకూలిన హెలికాప్టర్.. ప్రచారానికి వెళ్తుండగా ప్రమాదం

Helicopter Crash: మహారాష్ట్రలో హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకుంది. లోక్‌సభ ఎన్నిక ప్రచారంలో భాగంగా శివసేన ఉద్ధవ్ ఠాక్రే పార్టీకి చెందిన సుష్మా అంధారే.. ప్రయాణించాల్సిన హెలికాప్టర్.. ల్యాండింగ్ సమయంలో క్రాష్ అయింది. ఆమెను తీసుకువెళ్లేందుకు వచ్చిన ఓ ప్రైవేటు హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా.. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే ప్రమాదం జరుగుతుందని ముందే గుర్తించిన పైలట్.. అలర్ట్ అయి హెలికాప్టర్ నుంచి బయటికి దూకేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనపై అప్రమత్తమైన పోలీసులు, అధికారులు.. ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లాలోని మహద్ పట్టణంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీకి చెందిన సుష్మా అంధారేను తీసుకెళ్లేందుకు వచ్చిన ఓ ప్రైవేట్ హెలికాప్టర్‌ను.. ఓపెన్ గ్రౌండ్‌లో ల్యాండింగ్‌ చేస్తుండగా.. అకస్మాత్తుగా కూలిపోయిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి హెలికాప్టర్ కూలిపోతున్న దృశ్యాలను సుష్మా అంధారే సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతున్నాయి. హెలికాప్టర్ కూలిపోవడంతో ఆ ప్రాంతం మొత్తం పెద్ద ఎత్తున ధూళి వ్యాపించింది. ఆ సమయంలో భారీ శబ్దం వచ్చినట్లు స్థానికులు తెలిపారు.

హెలికాప్టర్ కూలిపోయిందన్న సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు వెంటనే సంఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదస్థలిని పరిశీలించి.. హెలికాప్టర్ కూలిపోవడానికి గల కారణాలు తెలుసుకున్నారు. ఈ ఘటన తర్వాత సుష్మా అంధారే.. హెలికాప్టర్ ప్రయాణాన్ని రద్దు చేసుకుని.. కారులో ప్రచారానికి వెళ్లిపోయారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-03T15:00:49Z dg43tfdfdgfd