KEJRIWAL BAIL: కేజ్రీవాల్‌ బెయిల్‌పై సుప్రీం ఆంక్షలు.. బెయిల్ వచ్చినా సీఎంగా విధులు నిర్వర్తించొద్దని వెల్లడి

Delhi Excise Policy Case: దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ.. తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల వేళ ఆప్‌ను అణిచివేసేందుకే కేజ్రీవాల్‌ను జైలులో పెట్టారని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఆప్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అంతేకాకుండా ఆప్ తరఫున కేజ్రీవాల్‌ను ప్రచారం చేయకుండా అడ్డుకుంటున్నారని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల వేళ తమ పార్టీ తరఫున ప్రచారం చేసుకునేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఢిల్లీ మద్యం కేసులో అరవింద్‌ కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కేజ్రీవాల్.. పార్టీ తరఫున ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కానీ ఈ కేసులో మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తే మాత్రం ఢిల్లీ ముఖ్యమంత్రిగా అధికారిక బాధ్యతలు నిర్వర్తించొద్దని కొత్త షరతు పెట్టింది.

ఈ కేసులో తనను ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణ జరిపేందుకు సమయం పట్టే అవకాశాలు ఉన్నందున మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణ చేసింది. ఈ క్రమంలోనే.. ఇది చాలా అసాధారణ పరిస్థితి అని పేర్కొన్న సుప్రీంకోర్టు.. ఢిల్లీ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అని తెలిపింది. అంతేకాకుండా ఆయన తరచూ నేరాలు చేసే వ్యక్తి కాదని.. లోక్‌సభ ఎన్నికలు 5 ఏళ్లకు ఒకసారి మాత్రమే వస్తాయని.. పార్టీ అధినేతగా ఉన్న కేజ్రీవాల్ ప్రచారం చేయాల్సి వస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది.

ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని ఈడీ ఖండించింది. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఈ కేసును ప్రత్యేకంగా పరిగణించకూడదని పేర్కొంది. రాజకీయ నాయకులకు కేసుల్లో మినహాయింపులు ఉండొద్దని.. ఇలాంటి సమయంలో కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు చేస్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఈడీ కోర్టుకు విన్నవించింది. అంతేకాకుండా ఢిల్లీ లిక్కర్ కేసులో దర్యాప్తుకు కేజ్రీవాల్‌ సహకరించలేదని.. 9 సార్లు సమన్లు ఇచ్చినా పట్టించుకోకపోవడంతోనే అరెస్టు చేసినట్లు తెలిపింది.

ఈడీ వాదనల తర్వాత కేజ్రీవాల్ లాయర్ చేసిన వాదనలు విన్న సుప్రీంకోర్టు.. ఒకవేళ ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్‌ ఇస్తే ఢిల్లీ సీఎంగా అధికారిక విధులు నిర్వర్తించేందుకు అనుమతించబోమని పేర్కొంది. బెయిల్‌పై జైలు నుంచి విడుదలైతే ఫైళ్లపై సంతకాలు చేయొద్దని స్పష్టం చేసింది. అలా చేస్తే ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఇక తనను అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై దర్యాప్తు జరిపిన సుప్రీంకోర్టు.. దర్యాప్తులో జరుగుతున్న ఆలస్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కేజ్రీవాల్‌ అరెస్టు ముందు నాటి కేసు ఫైళ్లను సమర్పించాలని ఈడీ అధికారులను ఆదేశించగా.. ఆ ఫైళ్లను అధికారులు కోర్టు ముందు ఉంచారు.

ఇక ఈ కేసులో గతంలో విధించిన జ్యుడీషియల్ కస్టడీ నేటితో ముగియడంతో ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరు పరిచారు. ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ కేసు పురోగతిలో ఉందని.. కేజ్రీవాల్ కస్టడీని పొడిగించాలని ఈడీ కోర్టును కోరగా.. ఆయన కస్టడీని మే 20 వ తేదీకి పొడిగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు చెప్పింది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-07T09:59:42Z dg43tfdfdgfd