కాళ్లబేరానికి వచ్చిన మాల్దీవులు.. దయచేసి మా దేశానికి రండి.. భారతీయులకు రిక్వెస్ట్

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్‌ పర్యటన (Lakshadweep) సందర్భంగా భారత్‌పై అక్కసును వెళ్లగక్కుతూ మాల్దీవుల (Maldives) మంత్రులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులతో భారతీయులకు మండి.. బాయ్‌కాట్ మాల్దీవులకు పిలుపునిచ్చారు. ఇదే సమయంలో మాల్దీవుల అధ్యక్షుడు భారత్ వ్యతిరేక వైఖరితో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. మాల్దీవులకు పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో ఆదాయం కూడా పడిపోయింది. ఆ దేశానికి టూరిజం ప్రధాన ఆర్ధిక వనరుకావడంతో మాల్దీవులు ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దీంతో తమ తప్పును తెలుసుకున్న మాల్దీవులు కాళ్లబేరానికి వచ్చింది.

దేశ ఆర్ధిక వ్యవస్థకు ప్రధాన వనరైన పర్యాటకంలో భారతీయులు తమకు సహకరించాలని కోరుతూ మాల్దీవుల పర్యాటక మంత్రి ఇబ్రహీమ్ ఫైజల్ అభ్యర్ధించారు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రకటన చేశారు. ఈ సందర్భంగా భారత్, మాల్దీవుల మధ్య ఉన్న చరిత్రాత్మక సంబంధాల గురించి ఆయన ప్రస్తావించారు. ‘మనకు ఓ చరిత్ర ఉంది.. కొత్తగా ఎన్నికైన మా ప్రభుత్వం కూడా (భారత్‌తో) కలిసి పనిచేయాలని కోరుకుంటోంది.. మేము ఎల్లప్పుడూ శాంతి, స్నేహపూర్వక వాతావరణాన్ని ప్రోత్సహిస్తాం... భారతీయుల రాకపోకలకు మా ప్రజలు, ప్రభుత్వం ఘన స్వాగతం పలుకుతున్నాయి... దయచేసి మాల్దీవుల టూరిజంలో భాగస్వామ్యం కావాలని పర్యాటక మంత్రిగా భారతీయులకు చెప్పాలనుకుంటున్నాను.. మా ఆర్థిక వ్యవస్థ టూరిజంపై ఆధారపడి ఉంది’ అని అన్నారు.

భారత్‌పైనా, ప్రధాని మోదీపైనా అక్కసును వెళ్లగక్కుతూ మాల్దీవుల మంత్రులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులతో భారతీయులకు చిర్రెత్తుకొచ్చింది. బాయ్‌కాట్ మాల్దీవులకు అని పిలుపునివ్వడంతో ఆ దేశంలో వెకేషన్ ప్లాన్ చేసుకున్నవారు మనసు మార్చుకున్నారు. హోటల్ బుకింగ్స్, భారత్ నుంచి ఫ్లైట్ టికెట్ల క్యాన్సిలేషన్లు పెద్ద మొత్తంలో రద్దయ్యాయి. మాల్దీవుల నష్టనివారణ చర్యలు చేపట్టి భారత్‌పై నోరు పారేసుకున్న ముగ్గురు మంత్రులపై వేటు వేసింది. అయినప్పటికీ భారత్ ఆగ్రహం చల్లారలేదు.

పర్యాటక వైబ్‌సైట్ sun.mv సోమవారం ప్రకటించిన నివేదిక ప్రకారం.. గత సంవత్సరం మొదటి నాలుగు నెలలతో పోలిస్తే ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో భారత్ నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య 42 శాతం తగ్గింది. ఈ ఏడాది ఆరంభంలో మాల్దీవులకు వచ్చే పర్యాటకుల్లో భారతీయులు తొలిస్థానంలో ఉన్నారు. కానీ, ప్రస్తుతం వీరి సంఖ్య ఆరో స్థానానికి పడిపోయిందని న్యూస్ పోర్టల్ నివేదించింది.

పర్యాటక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. మే 4 నాటికి మాల్దీవులకు భారత్ నుంచి మొత్తం 43,991 మంది పర్యాటకులు వెళ్లారు. గత ఏడాది ఇదే సమయానికి 73,785 మంది భారతీయులు ఆ దేశాన్ని సందర్శించడం గమనార్హం. గతేడాదిో పోల్చితే వీరి సంఖ్య 42,638 మంది తక్కువ.

హిందూ మహాసముద్రంలో భారత్‌కు వ్యూహాత్మక భాగస్వామి అయిన మాల్దీవులు.. శ్రీలంక తర్వాత అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కూడా. ఆ దేశ స్వాతంత్య్రాని గుర్తించి మొదటి దేశాల్లో భారత్ ఒకటి. దక్షిణాసియా దేశాల కూటమి సార్క్‌లో మాల్దీవులు సభ్య దేశం. గత ఏడాది నవంబరులో జరిగిన మాల్దీవుల ఎన్నికల్లో చైనా అనుకూల ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మహ్మద్ ముయిజ్జు భారత వ్యతిరేక నినాదంతో ఎన్నికల ప్రచారం నిర్వహించి విజయం సాధించాడు. భారత్ అనుకూలుడైన ఇబ్రహీం మహ్మద్ సోలిహ్ ఓటమితో.. మాల్దీవుల్లో చైనా ప్రాబల్యం పెరగడం మొదలైంది. అప్పటి నుంచి భారత్‌ను దూరం పెడుతోంది. భారత సైనికులను వెనక్కి పంపాలని నిర్ణయించింది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-07T02:29:21Z dg43tfdfdgfd