Nara Bhuvaneshwari Filed Nomination On Behalf of Chandrbabu In Kuppam: రాష్ట్రంలో రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. తొలి రోజు పలువురు కీలక నేతలు ఆర్వో కార్యాలయాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. కుప్పంలో (Kuppam) రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను ఆమె సమర్పించారు. అంతకు ముందు భారీ ర్యాలీగా భువనేశ్వరి ఆర్వో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఈ ర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. దీంతో కుప్పం రోడ్లు జనసంద్రంగా మారాయి. కార్యకర్తలకు అభివాదం చేస్తూ ఆమె ముందుకు సాగారు. నామినేషన్ వేసే ముందు భువనేశ్వరి పలు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ప్రసన్న వరదరాజ స్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం లక్ష్మీపురంలోని మసీదు ఆవరణలో ముస్లిం సోదరులతో ప్రార్థనలు నిర్వహించారు. ఆ తర్వాత బాబూనగర్ లోని చర్చిలో ప్రార్థనలు చేశారు.