SAVITRI JINDAL: కాంగ్రెస్‌కు షాకిచ్చిన దేశంలోనే రిచెస్ట్ మహిళ.. 84 ఏళ్ల వయసులో బీజేపీలో చేరిన సావిత్రి

Savitri Jindal: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకున్న సీనియర్ నేతలు, కేంద్రమంత్రులుగా పనిచేసినవారు, సీఎంలుగా పనిచేసినవారు కూడా హస్తం పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. గత దశాబ్ద కాలంగా కాంగ్రెస్ గ్రాఫ్ దారుణంగా పడిపోతుండగా.. ఈ ఎన్నికల్లోనైనా సత్తా చాటి పునర్వైభవాన్ని దక్కించుకోవాలని ఆశిస్తుండగా వాటికి బ్రేకులు పడుతున్నాయి. తాజాగా దేశంలోనే అత్యంత ధనవంతురాలైన మహిళా నేత కాంగ్రెస్ పార్టీని వీడారు. అనంతరం బీజేపీ కండువా కప్పుకున్నారు.

84 ఏళ్ల సావిత్రి జిందాల్.. తన కుమార్తె సీమాతో కలిసి బీజేపీలో చేరారు. హర్యానా సీఎం నయాబ్ సింగ్ షైనీ, మాజీ సీఎం మనోహర్ లాల్ కట్టర్ సమక్షంలో ఆమె కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో హర్యానాలోని హిసార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సావిత్రి జిందాల్.. హర్యానా మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఇక ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడిన ఆమె కుమారుడు, మాజీ ఎంపీ నవీన్ జిందాల్.. బీజేపీలో చేరారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో హర్యానాలోని కురుక్షేత్ర నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయన చేరిన కొన్ని రోజులకే సావిత్రి జిందాల్ కూడా బీజేపీలో చేరడం గమనార్హం.

కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్లాలనే నిర్ణయాన్ని సావిత్రి జిందాల్.. బుధవారం అర్ధరాత్రి తన సోషల్ మీడియా పోస్టు ద్వారా వెల్లడించారు. గత 10 సంవత్సరాలుగా హిసార్ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించానని.. అంతేకాకుండా మంత్రిగా కూడా హర్యానా రాష్ట్రానికి నిస్వార్థంగా సేవ చేసినట్లు తెలిపారు. హిసార్ ప్రజలే తన కుటుంబమని.. తన కుటుంబ సభ్యుల సలహా మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పోస్ట్ చేశారు. ఆ తర్వాత రోజే ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు.

ఈ ఏడాది ఫోర్బ్స్ ఇండియాలో లిస్ట్‌లో అత్యంత సంపన్న మహిళగా సావిత్రి జిందాల్ నిలిచారు. దివంగత బిజినెస్‌మెన్, మాజీ మంత్రి ఓపీ జిందాల్ భార్య సావిత్రి జిందాల్ నికర విలువ 29.1 బిలియన్ డాలర్లుగా ఉంది. గతంలో హర్యానాలో భూపిందర్ సింగ్ హుడా నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆమె మంత్రిగా కూడా పనిచేశారు. 2014 లో హిస్సార్ నుంచి బీజేపీ అభ్యర్థి కమల్ గుప్తా చేతిలో ఓడిపోయారు. గుప్తా ప్రస్తుతం సైనీ నేతృత్వంలోని ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్రంలో బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తాము కలిసి పనిచేస్తామని సావిత్రి జిందాల్ పేర్కొన్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-03-28T18:14:05Z dg43tfdfdgfd