SRI LANKA: శ్రీలంక నుంచి తమిళనాడుకు సముద్రంలో ఈత.. మధ్యలోనే ప్రాణాలు కోల్పోయిన వృద్ధుడు

Sri Lanka: శ్రీలంక, భారత్‌ మధ్య సముద్రంలో ఈత కొట్టాలని సాహసం చేసేందుకు ప్రయత్నించిన ఓ వృద్ధుడు మధ్యలోనే ప్రాణాలు వదిలాడు. బెంగళూరుకు చెందిన 78 ఏళ్ల గోపాల్‌రావు అనే వృద్ధుడు.. ఈ సాహసం చేయబోయి చనిపోయాడు. కొందరు ఈతగాళ్లు రిలే స్విమ్మింగ్ ఈవెంట్‌ను నిర్వహించగా.. శ్రీలంక నుంచి పాక్ జలసంధి మీదుగా భారత్‌కు ఈ రిలే స్విమ్మింగ్ ఈవెంట్‌ను ప్రారంభించారు. ఈ ఈవెంట్‌లోనే గోపాల్‌రావు కూడా పాల్గొన్నాడు. శ్రీలంకలోని తలైమన్నార్ నుంచి తమిళనాడులోని ధనుష్కోడి మధ్య ఈత కొడుతుండగా గోపాల్‌రావుకు అస్వస్థతకు గురయ్యాడు. ఛాతి నొప్పి రావడంతో ఈ విషయాన్ని తోటి ఈతగాళ్లకు గోపాల్‌రావు చెప్పాడు. అయితే అతడిని తోటి ఈతగాళ్లు బయటికి తీసుకువచ్చే ప్రయత్నం చేయగా.. గుండెపోటుతో అక్కడే ప్రాణాలు వదిలాడు.

ఏప్రిల్ 22 వ తేదీన రామేశ్వరం నుంచి పడవలో బయలుదేరి శ్రీలంకలోని తలైమన్నార్‌కు గోపాల్‌రావు చేరుకున్నాడు. ఆ తర్వాత ఏప్రిల్ 23 వ తేదీన తెల్లవారుజామున 12.10 గంటలకు తలైమన్నార్ నుంచి తమిళనాడులోని ధనుష్కోడి వైపు ఈతగాళ్లు ఈత ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే శ్రీలంక నుంచి ఇండియాకు వస్తుండగా గోపాల్‌రావు మార్గమధ్యలో అసౌకర్యానికి గురయ్యాడు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో తనకు ఛాతీ నొప్పి వస్తున్నట్లు పక్కనే ఉన్న ఇతర స్విమ్మర్లకు తెలిపాడు. దీంతో వెంటనే గోపాల్‌రావును పడవలోకి ఎక్కించి ఒడ్డుకు చేర్చేందుకు ప్రయత్నించారు.

అయితే అక్కడ మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉన్నప్పటికీ.. దురదృష్టవశాత్తు అప్పటికే గోపాల్‌రావు ప్రాణాలు విడిచినట్లు డాక్టర్లు ప్రకటించారు. గోపాల్‌రావు మరణించడంతో ఆ రిలే ఈవెంట్‌ను స్విమ్మర్‌లు రద్దు చేశారు. అక్కడి నుంచి పడవలో ధనుష్కోడి ద్వీపానికి తిరిగి వచ్చారు. ఆ తర్వాత గోపాల్‌రావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ రిలే స్విమ్మింగ్ ఈవెంట్‌కు భారత్, శ్రీలంక దేశాల నుంచి స్విమ్మర్లు అనుమతి పొందినట్లు తెలుస్తోంది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-23T16:17:08Z dg43tfdfdgfd