SURYAPETA ACCIDENT: తీవ్ర విషాదం - కంటెయినర్ కిందకు కారు దూసుకెళ్లి దంపతుల దుర్మరణం, ఎక్కడంటే?

Couple Died in Suryapeta Road Accident: సూర్యాపేట (Suryapeta) జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో దంపతులు స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు. మునగాల మండలం ముకుందాపురం (Mukundapuram) శివారులో రహదారి పక్కన ఆగి ఉన్న కంటెయినర్ కిందకు కారు దూసుకెళ్లడంతో ప్రమాదం జరగ్గా.. ఈ ఘటన స్థానికంగా భయాందోళన కలిగించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవరం గ్రామానికి చెందిన సామినేని నవీన్ రాజ్ (29)కు ఏపీలోని ఎన్టీఆర్ కృష్ణా జిల్లా విస్సన్నపేట గ్రామానికి చెందిన భార్గవి (27)తో రెండేళ్ల క్రితం వివాహం అయ్యింది. నవీన్ రాజ్ విజయవాడలో ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్ గా చేస్తుండగా.. భార్గవి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నారు. శనివారం భార్గవి పుట్టినరోజు సందర్భంగా దంపతులిద్దరూ కారులో హైదరాబాద్ లోని హయత్ నగర్ లో నవీన్ రాజ్ తల్లిదండ్రుల వద్దకు వెళ్లారు. తిరిగి సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి విజయవాడకు కారులో బయల్దేరారు.

కంటెయినర్ ను ఢీకొని

ఈ క్రమంలో కారులో వస్తుండగా.. ముకుందాపురం శివారులో హెచ్ పీ పెట్రోల్ బంక్ ఎదురుగా రోడ్డు పక్కన ఆగి ఉన్న భారీ కంటెయినర్ ను వెనుక నుంచి వేగంగా ఢీకొట్టారు. కంటెయినర్ కిందకు ఒక్కసారిగా కారు దూసుకెళ్లింది. ఈ క్రమంలో దంపతులిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద దృశ్యాలు అక్కడి సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. కంటెయినర్ కింద మృతదేహాలు ఇరుక్కుపోవడంతో భారీ క్రేన్, జేసీబీలతో దాదాపు గంట పాటు శ్రమించి వాటిని బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పెట్రోల్ బంక్ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: TSRTC సిబ్బందిపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు- డ్రైవర్ రాములుపై దాడిని ఖండించిన సజ్జనార్

2024-04-23T05:16:27Z dg43tfdfdgfd