TS EAPCET 2024: ఏపీ, తెలంగాణలో పెరుగనున్న ఈఏపీ సెట్‌ కేంద్రాలు... రెండు తెలుగు రాష్ట్రాల్లో అదనపు పరీక్షా కేంద్రాలు

TS EAPCET 2024 Update: తెలంగాణలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీ సెట్‌ పరీక్షా కేంద్రాలను పెంచాలని జేఎన్‌టియూ హైదరాబాద్ అధికారులు యోచిస్తున్నారు.

2024-25 విద్యా సంవత్సరంలో తెలంగాణ ఈఏపీ సెట్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్ధులు ఈఏపీ సెట్‌కు హాజరయ్యేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకు ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం 1,93,468మంది దరఖాస్తు చేసుకున్నారు. అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం మరో 71,999మంది దరఖాస్తు చేశారు.

రెండు విభాగాల్లో కలిపి జేఎన్‌టియూ JNTUకు దాదాపు 2,66,121 దరఖాస్తులు అందాయి. తెలంగాణ ఈఏపీ సెట్‌ 2024 దరఖాస్తులు సమర్పించడానికి మరో 9 రోజులు గడువు ఉండటంతో దాదాపు మూడున్నర లక్షల దరఖాస్తులు రావొచ్చని భావిస్తున్నారు.

ఇప్పటి వరకు అందిన రెండు లక్షల 66వేల దరఖాస్తుల్లో తెలంగాణ  Telangana నుంచి 1,63,748 దరఖాస్తులు, ఆంధ్రప్రదేశ్‌ స్థానికత కలిగిన విద్యార్ధుల నుంచి 29,720 దరఖాస్తులు అందాయని అధికారులు వెల్లడించారు.తెలంగాణ ఈఏపీ సెట్‌కు హాజరయ్యే విద్యార్ధుల సంఖ్య పెరుగనుండటంతో పరీక్షా కేంద్రాలను కూడా పెంచాలని జేఎన్‌టియూ వర్గాలు భావిస్తున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదట 208 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్ధుల సంఖ్య పెరుగుతుండటంతో ఏపీతో పాటు తెలంగాణలో కూడా మరికొన్ని కేంద్రాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు ఏపీలోని ప్రధాన నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఈఏపీసెట్ కో కన్వీనర్ విజయ్ కుమార్‌ రెడ్డి వెల్లడించారు. పరీక్షా కేంద్రాల జాబితాను రెండు మూడు రోజుల్లో ప్రకటిస్తామన్నారు.

రిజిస్ట్రేషన్లు ప్రారంభం…

TS EAP CET 2024: తెలంగాణ ఈఏపీ సెట్‌ EAPCET 2024 నోటిఫికేషన్ కొద్ది రోజుల క్రితం విడుదలైంది. గతంలో ఎంసెట్‌గా నిర్వహించే ప్రవేశపరీక్షను కొద్ది రోజుల క్రితం తెలంగాణ ఈఏపీ సెట్‌గా మార్చారు. మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం విడిగా నీట్ ప్రవేశపరీక్ష నిర్వహిస్తున్నారు.

తెలంగాణ ఈఏపీ సెట్ 2024 నోటిఫికేషన్ Notification ఇప్పటికే విడుదలైంది. జేఎన్‌టియూ హైదరాబాద్‌ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణలో ఇంజనీరింగ్ Engineering కాలేజీలతో పాటు అగ్రికల్చర్ Agriculture, ఫార్మసీ Pharmacy కాలేజీల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహించేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి తరపున జేఎన్‌టియూ హైదరాబాద్‌ నోటిఫికేషన్ జారీ చేసింది.

ఈఏపీ సెట్ 2024ను కంప్యూటర్ ఆధారిత పరీక్ష Computer Based test ద్వారా నిర్వహిస్తారు. ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్‌ టెస్ట్‌ 2024 ద్వారా 2024-25 విద్యా సంవత్సరానికి అయా కోర్సుల్లో ర్యాంకులు, రిజర్వేషన్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.

తెలంగాణ ఈఏపీ సెట్‌ 2024ను ఆన్‌లైన్‌ పద్ధతిలో మాత్రమే నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ స్పష్టం చేశారు. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌ పద్ధతిలో మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 26వ తేదీ నుంచి ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 6వ తేదీ వరకు ఈఏపీ సెట్‌ దరఖాస్తులు స్వీకరిస్తారు.

ఆలస్య రుసుము వివరాలు, తేదీలను నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. పూర్తి సమాచారం కన్వీనర్ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. మరింత సమాచారంతో పాటు దరఖాస్తుల కోసం అధికారిక వెబ్‌సైట్ https://eapcet.tsche.ac.in లో అందుబాటులో ఉంటుంది.

మారిన షెడ్యూల్….

సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో… రాష్ట్రంలోని పలు పరీక్షలను తెలంగాణ ఉన్నత విద్యామండలి రీషెడ్యూల్ Re Schedule చేస్తోంది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం…. మే 9వ తేదీ నుంచి ఈఏపీ సెట్ పరీక్షలు(TS EAPCET)) ప్రారంభం కావాల్సి ఉంది. ఈ పరీక్షలు మే12వ తేదీతో పూర్తి అవుతాయి.

ఏపీ, తెలంగాణలలో మే 13వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల తేదీకి, పరీక్షల తేదీకి ఒక్క రోజు మాత్రమే గ్యాప్ ఉండటంతో…. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఉన్నత విద్యామండలి రీ షెడ్యూల్ చేయాలని నిర్ణయించింది.

మే 7వ తేదీ నుంచే పరీక్షలను ప్రారంభించాలని నిర్ణయించింది. మే 7, 8వ తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మా పరీక్షలు, మే 9, 10, 11వ తేదీల్లో ఇంజనీరింగ్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు.

2024-03-28T03:51:23Z dg43tfdfdgfd