TTD SVITSA 2024 : విద్యార్థులకు మంచి ఛాన్స్..! ఎస్వీ శిల్ప కళాశాలలో ప్రవేశాలు - టీటీడీ ప్రకటన

SV Traditional Sculpture Institution Admissions 2024 : శ్రీ వేంకటేశ్వర సాంప్రదాయ ఆలయ శిల్ప కళాశాలలో ప్రవేశాల నోటిఫికేషన్(SVITSA Admissions) వచ్చేసింది ఈ మేరకు టీటీడీ వివరాలను వెల్లడించింది.

టీటీడీ(TTD) ఆధ్వర్యంలో ఈ కాలేజీ నడుస్తుంది. 202-25 విద్యాసంవత్సరానికి గాను సాంప్రదాయ కళంకారి కళలో డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనుంది. ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

కళాశాలలో జూలై 17వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని టీటీడీ(Tirumala Tirupati Devasthanams) తెలిపింది. 4 సంవత్సరాల డిప్లొమా, 2 సంవత్సరాల సర్టిఫికెట్ కోర్సులో చేరే విద్యార్థులు.. ఇతర వివరాల కోసం www.tirumala.org వెబ్‌సైట్‌ను చూడొచ్చు. తిరుమలలోని కళాశాల కార్యాలయాన్ని లేదా 0877-2264637, 9866997290 నంబర్ల ద్వారా సంప్రదించవచ్చని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.

తిరుమలలో భాష్యకారుల ఉత్సవం..

తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవా(Bhashyakara Utsavam) కొనసాగుతున్నాయి. శుక్ర‌వారం ఘనంగా ప్రారంభమైన ఈ వేడుకలు… 19 రోజుల పాటు జరగనున్నాయి. మే 12న శ్రీ భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు.

భగవద్‌ రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతపరంగా మీమాంస గ్రంథానికి ”శ్రీభాష్యం” పేరుతో వ్యాఖ్యానం చేశారు. అందుకే భాష్యకారులుగా పేరొందారు. శ్రీరామానుజులవారు జన్మించిన అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాదీ శ్రీవారి ఆలయంలో భాష్యకార్ల సాత్తుమొర నిర్వహిస్తారు.

టీటీడీకి లారీ విరాళం….

తిరుమల శ్రీవారికి శనివారం ఒక లారీ విరాళంగా అందింది. చెన్నైకి చెందిన అశోక్‌ లేలాండ్‌ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రెసిడెంట్సంజీవ్ కుమార్ రూ.31.31 లక్షల విలువైన లారీని అందజేశారు. ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట కొత్త వాహనానికి పూజలు నిర్వహించి, తాళాలను ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు.

తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి విచ్చేసే భ‌క్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంద‌ని టీటీడీ వెల్లడించింది. అందుకు త‌గ్గ‌ట్టు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు ఈవో ధ‌ర్మారెడ్డి పునరుద్ఘాటించారు. 

2024-05-05T08:15:49Z dg43tfdfdgfd