YS SHARMILA: ప్రజల ముందు కొంగుచాచిన వైఎస్‌ షర్మిల.. న్యాయం చేయాలని డిమాండ్‌

YS Sharmila: అధికారంలో ఉన్న వైఎస్‌ జగన్‌ లక్ష్యంగా అతడి సోదరి, కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శలు చేస్తున్నారు. బాబాయి వివేకానంద హత్యను షర్మిల ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. కడప పార్లమెంట్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షర్మిల మరోసారి జగన్‌, అవినాశ్‌ రెడ్డి విరుచుకుపడ్డారు. అంతేకాకుండా నవ సందేహాల పేరిట జగన్‌ మరో 9 ప్రశ్నలను షర్మిల సంధించారు.

Also Read: Laxmi Parvathi: 7వ తరగతి పాసవ్వని చంద్రబాబు 2 లక్షల కోట్లు దోపిడీ: ఎన్టీఆర్‌ భార్య

ఎన్నికల ప్రచారంలో భాగంగా షర్మిల కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో పర్యటించారు. పెద్దముడియం మండలం సుద్ధపల్లి గ్రామంలో ఆమె మాట్లాడారు. 'రాముడికి లక్ష్మణుడు ఎలాగో వైఎస్సార్‌కు వివేకా అలా ఉండేవాడు. వివేకా చనిపోయి ఐదేళ్లు అయ్యింది. ఎవరు చంపారో అందరికీ తెలుసు. అవినాష్ రెడ్డి నిందితుడు అని అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. అన్ని వేళ్లు అవినాష్ రెడ్డివైపే చూపిస్తున్నాయి. చంపించిన వారికి, చంపిన వారికి ఈరోజుకి శిక్ష లేదు. చనిపోయింది వైఎస్సార్‌ తమ్ముడు. హంతకులను కాపాడుతున్నది జగన్ మోహన్ రెడ్డి' అని షర్మిల ఆరోపించారు.

Also Read: Asaduddin Owaisi: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచేది అతడే.. నా మద్దతు అతడికే: అసదుద్దీన్ ఓవైసీ

'అవినాష్ రెడ్డిని అరెస్టు చేయాలని చూస్తే కర్నూల్‌లో కర్ఫ్యూ సృష్టించారు. అరెస్ట్ కాకుండా జగన్ రెడ్డి అడ్డం పడ్డాడు. ఎందుకు హంతకులను వెనకేసుకు వస్తున్నారు జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి' అని షర్మిల ప్రశ్నించారు. హత్య జరిగినప్పుడు CBI విచారణ కావాలని అడిగిన జగన్‌ సీఎం అయ్యాక వద్దు అంటున్నాడు. సీబీఐ విచారణ అంటే జగన్ ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. నిందితుడికి మళ్లీ ఎందుకు పట్టం కడుతున్నారు? అని ప్రశ్నించారు. అధికారం అడ్డం పెట్టుకుని అవినాష్ రెడ్డిని కాపాడడం అన్యాయం, అక్రమం అని తెలిపారు.

'అన్యాయాన్ని ఎదురించేందుకు నేను నిలబడ్డా. నేను వైఎస్సార్‌ బిడ్డ దేనికి భయపడను. న్యాయం వైపు నేను నిలబడ్డా. మీరు న్యాయం వైపా? అన్యాయం వైపా?' అని ప్రజలనుద్దేశించి షర్మిల అడిగారు. కొంగుచాచి న్యాయం అడుగుతున్నామని షర్మిల తెలిపారు. మీరు న్యాయం వైపు నిలబడతారని కోరుకుంటున్నానని.. ప్రజల కోసమే తన జీవితం అంకితమని పేర్కొన్నారు.

నవ సందేహాలు రెండో రోజు

ప్రశ్నల పేరిట సీఎం జగన్ మోహన్ రెడ్డికి రెండరోజు వైఎస్ షర్మిల లేఖ రాశారు. తొమ్మిది ప్రశ్నలు అడుగుతూ లేఖ విడుదల చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాల విషయంలో తాము అడుగుతున్న నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. షర్మిల అడిగిన ప్రశ్నలు ఇవే..

  1. ప్రభుత్వంలో వచ్చాక 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ హామీ ఏమైంది? ఏయే శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు?
  2. జనవరి 1న ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వలేదు ?
  3. 25 ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాం అన్నారు.. 22 ఎంపీలు ఇస్తే ఏం చేశారు?
  4. గ్రూప్ 2 నోటిఫికేషన్ రెండు సార్లు ఇచ్చి ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. ఎందుకు?
  5. విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఎందుకు భర్తీ చేయలేదు?
  6. 23 వేలతో మెగా డీఎస్సీ అని చెప్పి 6 వేలతో దగా డీఎస్సీ ఎందుకు వేశారు?
  7. రాష్ట్రంలో నిరుద్యోగులు 7.7 శాతం పెరిగారు అంటే అది మీ వైఫల్యం కాదా?
  8. ఉద్యోగాలు లేక బిడ్డలు ఇతర రాష్ట్రాలకు వలసలు ఎందుకు పోతున్నారు?
  9. జాబు రావాలి అంటే బాబు పోవాలి అన్నారు...ఇప్పుడు జాబు రావాలి అంటే మీ పాలన పోవాలి అంటే అంగీకరిస్తారా? స్కిల్ డెవలమెంట్ ట్రైనింగ్ సెంటర్లను ఎందుకు నిలిపివేశారు?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

2024-05-02T08:12:56Z dg43tfdfdgfd