ఇండియా కూటమిపై నోరు పారేసుకోవద్దు : బీవీ రాఘవులు
హైదరాబాద్, వెలుగు: ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలను విమర్శించే బదులు, తెలంగాణలో బీజేపీ ఒక్క స్థానం గెలవకుండా చూస్తే బాగుంటుందని సీఎం రేవంత్ రెడ్డికి సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు హితవు పలికారు. 'కేరళలో కాంగ్రెస్, సీపీఎం ప్రధాన ప్రత్యర్థులుగా ఉండి బీజేపీని ఆపగలిగాయి. బీజేపీ తెలంగాణలో అధిక స్థానాలు గెలవాలని చూస్తున్నది. రేవంత్ రెడ్డి కేరళ వెళ్లి మాట్లాడడం కాదు. ఇక్కడ బీజేపీ ఒక్క స్థానం గెలవకుండా చూస్తే బాగుంటుంది. అది ప్రజలకు, దేశానికి, లౌకికవాదానికి మంచిది.
అక్కడకు వెళ్లి ఇండియా కూటమిలో ఉన్న భాగస్వామ్య పార్టీలపై నోరుపారేసుకోవడం కన్నా బీజేపీపై మాట్లాడితే బాగుంటుంది' అని రాఘవులు ఫైర్ అయ్యారు. గురువారం ఆయన ఎంబీ భవన్లో సీపీఎం ఎన్నికల ప్రణాళికను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ..లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలను ఓడించాలని ప్రజలను కోరారు. ఈ ఎన్నికల్లో సీపీఎంను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా కేంద్రంలో లౌకిక ప్రభుత్వ ఏర్పాటుకు తోడ్పడాలన్నారు. బీజేపీ విధానాలు దేశానికి, ఐక్యతకు, దేశాభివృద్ధికి ఆటంకమని పేర్కొన్నారు.
©️ VIL Media Pvt Ltd. 2024-04-19T04:30:41Z dg43tfdfdgfd