ఎంపీ అభ్యర్దిగా హీరో వెంకటేష్ వియ్యంకుడు! ప్రచారానికి వెళ్తాడా?

నామినేషన్ల చివరి నిముషంలో  ముందు ముగ్గురు ఎంపీ అభ్యర్థుల తుది జాబితాను తెలంగాణ కాంగ్రెస్‌ ప్రకటించింది. హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి మహమ్మద్‌ సమీర్, కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థిగా రాజేందర్‌రావుతో పాటు ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డిల పేర్లను అందులో వెల్లడించారు. ఇందులో ఇంట్రస్టింగ్ విషయమేమంటే.. ఖమ్మం అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి సినీ హీరో వెంకటేష్‌కు స్వయానా వియ్యంకుడు. 

తెలంగాణలో మే 13న లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా ఖమ్మం పార్లమెంట్ కి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డి నామినేషన్ వేశారు.  ఇక రఘురాంరెడ్డి రాజకీయాలకు కొత్తేమీ కాదు. ఆయన  సీనియర్ కాంగ్రెస్ నాయకులు రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడు. ఖమ్మం జిల్లాకు చెందిన సురేందర్ రెడ్డి.. కాంగ్రెస్ తరపున పలుసార్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలుపొందారు. వయసు రీత్యా సురేందర్ రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటుండగా.. ఇప్పుడు ఆయన కుమారుడు రఘురాంరెడ్డి రంగంలోకి దిగారు.

రఘురాంరెడ్డికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖ కుటుంబాలతో బంధుత్వం ఉంది. హీరో వెంకటేష్ కుమార్తె అశ్రితను ఆయన పెద్ద కుమారుడు వినాయక్ రెడ్డి పెళ్లి చేసుకోగా.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమార్తె స్వప్నిరెడ్డిని ఆయన చిన్నకుమారుడు అర్జున్ రెడ్డి వివాహం చేసుకున్నారు. అలా ఇటు వెంకటేష్ కి, అటు పొంగులేటికి రఘురాంరెడ్డి వియ్యంకుడు. కాబట్టి వెంకటేష్ ప్రచారానికి వచ్చే అవకాసం ఉందని అంటున్నారు. 

2024-04-25T06:57:10Z dg43tfdfdgfd