ఎల్ఐసీ స్లోగన్‌తో కాంగ్రెస్‌పై మరోసారి మోదీ విమర్శలు

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా, బుధవారం ఛత్తీస్‌గఢ్‌లో నిర్వహించిన ఎన్నికల సభలో హస్తం పార్టీని మరోసారి టార్గెట్ చేశారు. దోపిడీయే కాంగ్రెస్ విధానమని, ప్రజలను దోచుకోవడమే వారి లక్ష్యమని ఆరోపించారు. చనిపోయిన వారిని కూడా దోచుకోవాలనే ఆలోచనలో ఆ పార్టీ ఉందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులను దోచుకుంటుందని తాను చేసిన వ్యాఖ్యలను నిజమని ఆ పార్టీ నేతలే పరోక్షంగా నిర్ధారిస్తున్నారని ప్రధాని తూర్పారబట్టారు. ఒక్కొక్కటిగా ఆ పార్టీ ఆలోచనా విధానాన్ని నేతలు బయటపెడుతున్నారని పేర్కొన్నారు.

నిజాలు బయటపడుతున్నాయని ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ఉదాహరించారు. ‘బతికున్నంత కాలం కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని దోచుకుంటుంది... చనిపోయాక కూడా మీ ఆస్తులను కాజేస్తుంది’ అని మోదీ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ‘జిందగీ కే సాత్ భీ, జిందగీ కే బాద్ భీ’ అనే ఎల్ఐసీ స్లోగన్‌‌ను ప్రస్తావించారు. మీరు కష్టపడి సంపాదించిన సొమ్మును పన్నుల రూపంలో కాంగ్రెస్ లాక్కుంటుందని మోదీ ఆరోపించారు. చనిపోయాక మీరు మీ కుటుంబ సభ్యులకు వదిలి వెళ్లే ఆస్తులను ఎలా కాజేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు అర్థమవుతోందని ప్రధాని పేర్కొన్నారు.

ఈ సమయంలో శామ్ పిట్రోడా (పేరు ప్రస్తావించకుండానే) వ్యాఖ్యలే దీనికి నిదర్శనమని మోదీ చెప్పారు. జీవితాంతం కష్టపడి సంపాదించిన ఆస్తులను తమ పిల్లలకు అప్పగించే వీలులేకుండా కాంగ్రెస్ పార్టీ చేయాలనుకుంటోందని మోదీ ధ్వజమెత్తారు. ‘బతికున్నపుడు కాంగ్రెస్ విధించే పన్నులు చెల్లించలేక మీరు ఇబ్బందులకు గురవుతారు... చనిపోతూ మీరు వదిలివెళ్లిన ఆస్తులపై పన్నులు చెల్లించలేక మీ పిల్లలు అవస్థ పడాల్సి వస్తుంది’ అని మోదీ హెచ్చరించారు.

కాగా, అమెరికాలోని అమలవుతోన్న వారసత్వ పన్నును కాంగ్రెస్ సీనియర్ నేత, నాలెడ్జ్ కమిషన్ మాజీ ఛైర్మన్ శామ్ పిట్రోడా ప్రశంసలు కురిపించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు వదిలి వెళ్లే ఆస్తులపై అమెరికా వారసత్వ పన్ను విధిస్తోందని ఆయన చెప్పారు. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చే సంపదలో సగభాగానికిపైగా ప్రభుత్వానికి చెందుతుందని ఆయన వివరించారు. అంటే.. వారసత్వంగా వచ్చే ప్రతీ వంద డాలర్లలో దాదాపు 55 డాలర్లు వారసత్వ పన్ను కింద ప్రభుత్వం తీసేసుకుంటుందని, మిగతా 45 డాలర్లు మాత్రం వారసులకు దక్కుతుందని తెలిపారు. ఈ పద్ధతి న్యాయంగా ఉందని తాను భావిస్తున్నట్లు శామ్ పిట్రోడా వ్యాఖ్యానించారు. అయితే, ఈ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, పార్టీకి ఎటువంటి సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-24T09:19:35Z dg43tfdfdgfd