కుప్పకూలిన శివసేన లీడర్ హెలికాప్టర్
ముంబై: శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) నేత సుష్మా అంధారేకు కొద్దిలో హెలికాప్టర్ ప్రమాదం తప్పింది. ఆమెను తీసుకెళ్లేందుకు వచ్చిన ఓ ప్రైవేట్ హెలికాప్టర్.. ల్యాండింగ్ సమయంలో అకస్మాత్తుగా పెద్ద శబ్దంతో కుప్పకూలింది. మహారాష్ట్ర రాయ్గఢ్ జిల్లా మహద్ సిటీ సమీపంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు వెల్లడించారు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సుష్మా అంధారే గురువారం కొంకణ్ లో పర్యటించారని తెలిపారు. శుక్రవారం ఆమె పుణె జిల్లాలోని బారామతిలో ప్రచారం నిర్వహించాల్సి ఉందని చెప్పారు. అక్కడికి తీసుకెళ్లేందుకే ప్రైవేట్ హెలికాప్టర్ ఉదయం 9.30 గంటలకు మహద్ వచ్చిందన్నారు. టెక్నికల్ ఇష్యూతో ల్యాండింగ్ సమయంలో కుప్పకూలిందని వివరించారు.
హెలికాప్టర్ ప్రమాదాన్ని ముందే పసిగట్టిన పైలట్..వెంటనే బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడని వెల్లడించారు. పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. ప్రమాదం కారణంగా
సుష్మా అంధారే బారామతిలో ఎన్నికల ప్రచారానికి తన కారులో బయల్దేరారు. కాగా..ఘటనకు సంబంధించిన వీడియోను అంధారే సోషల్ మీడియాలో షేర్ చేయగా. అది వైరల్ అయింది.
©️ VIL Media Pvt Ltd. 2024-05-04T03:07:26Z dg43tfdfdgfd