కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా షర్మిల నామినేషన్
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడప ఎంపీగా నామినేషన్ వేశారు. వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత్, తులసీ రెడ్డితో కలిసి కలెక్టరేట్ లో నామినేషన్ దాఖలు చేశారు.
అంతకుముందు వైఎస్ షర్మిల ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ ను సందర్శించి నివాళి అర్పించారు. నామినేషన్ పత్రాలను సమాధిపై పెట్టి ఆశీస్సులు తీసుకున్నారు. తర్వాత కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. కడప ఎంపీగా వైఎస్సార్ సీపీ నుంచి వైఎస్ అవినాశ్ రెడ్డి పోటీ చేస్తున్నారు.
తనకు కడప ప్రజల ఆశీస్సులు కావాలని కోరుతూ ట్వీట్ చేశారు షర్మిల. ఒక అపురూప ఘట్టం ఆవిష్కరించబోతున్న ఈ సందర్భంలో దేవుని దీవెనలు, నాన్న ఆశీర్వాదం, ప్రియమైన అమ్మ, ముద్దుల బిడ్డల శుభాకాంక్షలు అందుకుని, న్యాయం కొరకు, విజయం వైపు ఈ అడుగు వేస్తున్నాను. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డిని మరిచి పోలేని ప్రజలు, అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. కడప ప్రజలు ధర్మం వైపే నిలబడతారని ఆశిస్తున్నా అని ట్వీట్ చేశారు షర్మిల.