కేజ్రీవాల్ అరెస్ట్‌పై మళ్లీ స్పందించిన అమెరికా.. కాంగ్రెస్ ఖాతాల ప్రస్తావన కూడా!

మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అంశంపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి స్పందించింది. ‘సమయానుకూల, పారదర్శక న్యాయ విచారణ’ జరగాలని తాము కోరుకుంటున్నట్టు అమెరికా పునరుద్ఘాటించింది. కేజ్రీవాల్ అరెస్ట్‌పై స్పందనకు నిరసగా అమెరికా రాయబారికి భారత్ సమన్లు పంపిన కొద్ది గంటలకే ఈ ప్రకటన చేయడం గమనార్హం. ఢిల్లీలోని అమెరికా దౌత్య అధికారి గ్లోరియా బెర్బెనాను భారత ప్రభుత్వం సమన్లు పంపడం మీడియా అడిగిన ప్రశ్నకు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ సమాధానం ఇస్తూ.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో సహా ఈ చర్యలను మేము నిశితంగా గమనిస్తూనే ఉన్నామని చెప్పారు.

విదేశాంగ మంత్రిత్వ శాఖ సౌత్ కార్యాలయంలో బుధవారం దాదాపు 40 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో కేజ్రీవాల్ అరెస్టు విషయంలో అమెరికా చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే, కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడంపై అడిగిన ప్రశ్నకు కూడా మిల్లర్ స్పందిస్తూ.. ‘ఆదాయపు పన్ను అధికారులు తమ బ్యాంకు ఖాతాలను కొన్నింటిని స్తంభింపజేశారని కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణల గురించి మాకు తెలుసు.. తద్వారా రాబోయే కాలంలో ఎన్నికల్లో సమర్థవంతంగా ప్రచారం చేయడం సవాలుగా మారుతుంది’ అని పేర్కొన్నారు.

ఈ అంశంల్లో సమయానుకూల, పారదర్శక న్యాయ విచారణ, చట్టపరమైన ప్రక్రియతో ముందుకెళ్లాలని మేము కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. ‘మీ మొదటి ప్రశ్నకు సంబంధించి నేను ఏ ప్రైవేట్ దౌత్య సంభాషణల గురించి మాట్లాడబోవడం లేదు.. అయితే, మేము బహిరంగా చెప్పేది నేను ఇక్కడ నుంచి చెప్పాను.. మేము న్యాయమైన, పారదర్శకమైన, సమయానుకూలమైన చట్టపరమైన ప్రక్రియలను ప్రోత్సహిస్తాం. దానికి ఎవరూ అభ్యంతరం చెప్పకూడదని మేము భావిస్తున్నాం’ అని మిల్లర్ వ్యాఖ్యానించారు.

ఢిల్లీ మద్యం పాలసీలో మనీల్యాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ గతవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై తొలుత జర్మనీ తర్వాత అమెరికాలు స్పందించాయి. అయితే, ఈ ప్రకటనలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతర్గత విషయాల్లో ఇలా జోక్యం చేసుకోవడం తగదని మండిపడింది.

‘దౌత్య సంబంధాల్లో భాగంగా.. దేశాలు ఇతరుల సార్వభౌమాధికారం, అంతర్గత వ్యవహారాలను గౌరవించాలి. మరీ ముఖ్యంగా.. తోటి ప్రజాస్వామ్య దేశాల విషయంలో ఈ బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుంది. లేదంటే సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది.. భారత్‌కు స్వతంత్ర న్యాయవ్యవస్థ ఉంది’ అని అమెరికాకు భారత్ స్పష్టంగా చెప్పింది.

2024-03-28T02:49:45Z dg43tfdfdgfd