చెరువుల ఆక్రమణలపైతీసుకున్న చర్యలేంటి : హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని చెరువులు, కుంటలు ఆక్రమణల నివారణకు తీసుకున్న చర్యలను నివేదించాలని సంబంధిత అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురవుతున్నాయంటూ ఓ పత్రికలో వచ్చిన స్టోరీని హైకోర్టు పిల్గా తీసుకుంది. దీనిని చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ బెంచ్ గురువారం విచారించింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక, హోం, నీటిపారుదల, రెవెన్యూ శాఖల ముఖ్యకార్యదర్శులు, హెచ్ఎండీఏ చెరువుల రక్షణ కమిటీ, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. విచారణను వాయిదా వేసింది. నాలాల్లో నిర్మాణాలు–చెరువుల్లో విల్లాలు..శీర్షికతో ఓ పత్రికలో వచ్చిన స్టోరీని చదివిన జస్టిస్ ఈవీ వేణుగోపాల్ ఇటీవల హైకోర్టుకు లేఖ రాశారు. దీన్ని హైకోర్టు పిల్గా స్వీకరించింది.
©️ VIL Media Pvt Ltd. 2024-04-19T01:15:43Z dg43tfdfdgfd