దేశ రాజకీయాల్ని వేడెక్కించిన ఈ శ్యాం పిట్రోడా ఎవరు? కాంగ్రెస్‌కి తలనొప్పిగా తయారయ్యారా?

Sam Pitroda Remarks: ప్రస్తుతం దేశ రాజకీయాల్లో బాగా వినిపిస్తున్న పేరు శ్యాం పిట్రోడా. అంతకు ముందు అతి తక్కువ మందికే తెలిసిన ఈ పేరు ఇప్పుడు అంతా మారుమోగుతోంది. అమెరికాలోని వారసత్వ పన్ను (Inheritance Tax Row) గురించి ఆయన ప్రస్తావించిన మరుక్షణం నుంచే ఆ వ్యాఖ్యలు దుమారం రేపాయి. అగ్రరాజ్యంలో ఎవరైనా సంపన్నులు చనిపోతే అందులో ఎక్కువ భాగం దేశానికి ఇచ్చేస్తారని, వారసులకు కొంతే దక్కుతుందని చెప్పారు. పైగా ఆ చట్టాన్ని సమర్థించారు. ఇదే వివాదాస్పదమైంది. ఇప్పటికే ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ పెంచాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అందరి ఆస్తులనూ దోచుకుని ముస్లింలకు పంచి పెడుతుందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. "ఆస్తి రాజకీయాలు" కొనసాగుతుండగానే శ్యాం పిట్రోడా (Who Is Sam Pitroda) వారసత్వ పన్ను గురించి మాట్లాడడం, ఇదీ కాంగ్రెస్ వైఖరి అంటూ బీజేపీ మండి పడడం చాలా వేగంగా జరిగిపోయాయి. ఆ తరవాత కాంగ్రెస్ రంగంలోకి దిగి ఆయన అభిప్రాయంతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. శ్యాం పిట్రోడా కూడా తన వ్యాఖ్యల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని వరుస పెట్టి సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. మొత్తానికి దేశమంతా ఒక్కసారి ఎవరీ శ్యాం పిట్రోడా అని ఆసక్తిగా గమనించేలా చేశారు. 

ఎవరు ఈ శ్యాం పిట్రోడా..?

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన విదేశీ వ్యవహారాలన్నింటినీ చూసుకునే నేత ఈ శ్యాం పిట్రోడా. Indian Overseas Congress కి చీఫ్‌. విదేశాల్లో ఉన్న భారతీయులతో సన్నిహితంగా ఉండడం, పార్టీకి వాళ్లకి దూరం పెరగకుండా చూసుకోవడం ఆయన విధులు. ఎన్నో ఏళ్లుగా ఆయన కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు. భారతదేశ మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్‌ హయాంలలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 20005-2009 మధ్య కాలంలో  National Knowledge Commission ఛైర్మన్‌గానూ పని చేశారు. రాజీవ్ గాంధీ హయాంలో టెలీకమ్యూనికేషన్స్, వాటర్ మేనేజ్‌మెంట్, డెయిరీ ఉత్పత్తులకు సంబంధించి ఎన్నో కొత్త విధానాలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. 

తరచూ వివాదాలు..

పిట్రోడా వ్యాఖ్యలు ఇలా వివాదాస్పదం కావడం ఇదే తొలిసారి కాదు. 1984లో సిక్కుల ఊచకోతకు సంబంధించి 2019లో మీడియా ప్రశ్నించింది. అందుకు పిట్రోడా "అయితే ఏంటి" అని సమాధానం ఇచ్చారు. అది తీవ్ర వివాదాస్పదమైంది. అప్పుడు జరిగిందేదో జరిగిందని చాలా మామూలుగా బదులిచ్చారు. ఆ తరవాత 2019లో జరిగిన సర్జికల్ స్ట్రైక్‌పైనా అనుమానం వ్యక్తం చేసి వివాదంలో చిక్కుకున్నారు. రామ మందిర నిర్మాణం గురించీ మాట్లాడుతూ ఆలయాలు ఉద్యోగాలు సృష్టించలేవంటూ ఆయన చేసిన వ్యాఖ్యలూ దుమారం రేపాయి. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సమస్యలతో దేశం సతమతం అవుతుంటే ఆలయాల గురించి మాట్లాడతారేంటి అంటూ బీజేపీపై మండి పడ్డారు. ఈ ఏడాది జనవరిలోనూ రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలూ వివాదానికి కారణమయ్యాయి. భారత రాజ్యాంగ రూపకల్పనలో అంబేడ్కర్ కన్నా ఎక్కువగా నెహ్రూ కష్టపడ్డారని అన్నారు. దీనిపై బీజేపీ తీవ్రంగా మండి పడింది. 

Also Read: Economy Meal: స్పెషల్‌ ఆఫర్ - రైల్వే స్టేషన్లలో 20 రూపాయలకే రుచికరమైన ఆహారం

2024-04-25T05:53:10Z dg43tfdfdgfd