దేశంలోనే తొలి కేసు: అధికారికంగా ఫోన్ ట్యాపింగ్ పై కేసు నమోదు
హైదరాబాద్ : తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసుపై అధికారికంగా బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. టెలిగ్రాఫ్ యాక్ట్ జతపరుస్తూ నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు. దీంతో దేశంలోనే తొలిసారిగా టెలిగ్రాఫ్ ఆక్ట్ కింద కేసు నమోదు అయ్యింది.
ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పాత్రధారులు, సూత్రధారులు ఎవరన్నది ఒక్కటొకటిగా తేలుతున్నది. పోలీసుల కస్టడీలో ఉన్న ఎస్ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్) మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు విచారణలో గుట్టు బయట పెడుతున్నాడు. ప్రతిపక్ష నేతలు, ప్రజా సంఘాల నేతలే టార్గెట్గా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిందని, ఇందులో నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు కీలకంగా వ్యవహరించారని చెప్పాడు. దీంతో ప్రభాకర్రావును ఈ కేసులో ప్రధాన నిందితుడి(ఏ1)గా పోలీసులు చేర్చారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నాడు.
ప్రణీత్ రావును ఏ2గా, సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ డీఎస్పీ రాధాకిషన్ రావును ఏ3గా, భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ(గతంలో ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ) భుజంగరావును ఏ4గా, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ అడిషనల్ డీసీపీ (గతంలో ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ) తిరుపతన్నను ఏ5గా చేర్చారు. మరికొందరు ప్రైవేట్ వ్యక్తుల పేర్లను కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. ఈ కేసులో ఏ3గా ఉన్న రాధాకిషన్ రావును పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తి అయ్యాయి. మరికాసేపట్లో రాధాకిషన్ ను కోర్టులో హాజరుపర్చనున్నారు.
©️ VIL Media Pvt Ltd. 2024-03-29T12:29:10Z dg43tfdfdgfd