పట్టా భూముల లెక్కనే .. అసైన్డ్ భూములకు పరిహారం : సీఎం రేవంత్ రెడ్డి
కొడంగల్, వెలుగు : కొడంగల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నియోజకవర్గానికి పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందని, పరిశ్రమలు వస్తే యువతకు ఉద్యోగాలు లభించడంతోపాటు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటు కోసం భూములు ఇవ్వాలని కోరారు. పట్టా భూముల లెక్కనే అసైన్మెంట్ భూములకు కూడా పరిహారం ఇప్పించేలా చూస్తామని హామీ ఇచ్చారు.
మహబూబ్నగర్ స్థానిక సంస్థల బై పోల్స్ సందర్భంగా ఆయన ఎక్స్ అఫీషియో హోదాలో కొడంగల్ పోలింగ్ సెంటర్లో గురువారం మధ్యాహ్నం ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం స్థానిక తన నివాసంలో మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డితో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కొడంగల్ భూములకు కోకాపేట భూములంత విలువ రావాలని, ఇది కొడంగల్ ప్రాంతం అభివృద్ధి చెందితేనే సాధ్యమని చెప్పారు. కష్ట కాలంలో ఇక్కడి ప్రజలు తనకు అండగా ఉన్నారని, వెనుకబడ్డ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు.
‘‘కొడంగల్కు పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు వస్తే చదువుకున్నోళ్లకు ఉద్యోగాలు వస్తయ్.. అంతేకాదు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఇక్కడి భూముల విలువలు పెరుగుతాయి. ఇయ్యాళ కోకాపేటలో రూ. వంద కోట్లకు ఎకరం.. కొడంగల్లో రూ.10 లక్షలకే ఎకరం ఎందుకు ఉంది? కోకాపేటలో పరిశ్రమలు, ఐటీ కంపెనీలు వచ్చినయ్. అందుకే అక్కడ భూములకు రేట్లు పెరిగినయ్. కొడంగల్ భూములకు కూడా ఆ విలువ రావాలి. ఎవరో ఒకరు భూములిస్తేనే పరిశ్రమలు ఏర్పాటు చేయొచ్చు. పట్టా భూముల లెక్కనే అసైన్మెంట్ భూములకు కూడా అంతే పరిహారం ఇవ్వాలని అధికారులకు సూచించాను” అని సీఎం పేర్కొన్నారు.
మెడికల్, ఇంజినీరింగ్, వెటర్నరీ, మహిళా డిగ్రీ కాలేజీలు, కొడంగల్ నారాయణపేట స్కీమ్ను కొడంగల్ ప్రాంతానికి మంజూరు చేశామని తెలిపారు. త్వరలోనే కస్తూర్పల్లిలో సిమెంట్ కంపెనీని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. అభివృద్ధిలో రాష్ట్రానికే ఆదర్శంగా ఉండేటట్టు కొడంగల్ను తీర్చిదిద్దాలనేదే తన ప్రయత్నమని సీఎం చెప్పారు. తాను ఎంత పెద్ద నాయకుడినైన కొడంగల్ కుటుంబ సభ్యుడినేనని, ఎప్పుడైనా, ఎక్కడున్నా ఒక కన్ను కొడంగల్పై ఉంటుందన్నారు.
50 వేల మెజారిటీ అందించాలి
లోక్సభ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి 50 వేల మెజారిటీ అందించి మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డిని గెలిపించాలని రేవంత్ రెడ్డి కోరారు. నియోజకవర్గ, మండల, బూత్ స్థాయిలో ఫైవ్ మెన్ కమిటీలను నియమించుకోవాలన్నారు. మళ్లీ ఏప్రిల్ 8న కొడంగల్ వచ్చి మండలాల వారీగా సమావేశమవుతానని చెప్పారు. వచ్చే నెల 6న తుక్కుగూడ రాజీవ్ ప్రాంగణంలో జరిగే రాహుల్ గాంధీ సభకు నియోజకవర్గం నుంచి భారీగా పార్టీ కార్యకర్తలు, లీడర్లు తరలి రావాలని ఆయన కోరారు.
గత పాలకులు పాలమూరుపై పగబట్టారు: వంశీచంద్రెడ్డి
పదేండ్లుగా గత పాలకులు పాలమూరుపై పగబట్టి నిర్లక్ష్యానికి గురిచేశారని సీడబ్ల్యూసీ మెంబర్, ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి సీఎం కావడం గర్వకారణమని చెప్పారు. రేవంత్ తనను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినా.. వాస్తవానికి రేవంత్ని చూసి ఓటు వేయాలన్నారు.
©️ VIL Media Pvt Ltd. 2024-03-29T01:28:11Z dg43tfdfdgfd