ఈ సంవత్సరం మార్చిలో తెలంగాణలో వడగళ్ల వానలు పడ్డాయి. దాంతో చాలా పంటలు దెబ్బతిన్నాయి. వాటిని అధికారులు పరిశీలించడం, నష్టాన్ని అంచనా వెయ్యడం, సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించడం అన్నీ అయ్యాయి. తాజాగా ఎన్నికల సంఘాన్ని కలిసి.. పంట నష్టం పరిహారం ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అందుకు ఈసీ సరే అంది. దాంతో ప్రభుత్వం వ్యవసాయ, ఉద్యాన పంటలకు పరిహారం ఇచ్చేందుకు వీలైంది. తెలంగాణ రెవెన్యూ శాఖ.. సహజ ప్రకృతి విపత్తుల నిర్వహణ కింద రూ.15.81 కోట్లను రైతులకు పరిహారంగా ప్రకటిస్తూ ఆదేశాలిచ్చింది.
ప్రభుత్వం విడుదల చేసిన డబ్బును.. అధికారులు.. పంట నష్టపోయిన రైతుల అకౌంట్లలో రెండ్రోజుల్లో జమ చేస్తారు. ఐతే.. రైతులు తమ బ్యాంక్ అకౌంట్కి తప్పనిసరిగా ఆధార్ లింక్ చేసుకొని ఉండాలి. అలా చేసుకోని వారు.. వెంటనే బ్యాంకుకి వెళ్లి.. ఆధార్ లింక్ చేయించుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది.
నెల రోజుల్లోనే:
పంట నష్ట పరిహారం నెల రోజుల్లోనే ఇస్తుండటం గొప్ప విషయంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపింది. ఇంత త్వరగా ఇదివరకు ఏ ప్రభుత్వమూ ఇవ్వలేదని చెప్పింది. పరిహారం మనీ ఎప్పుడో ఇవ్వాల్సి ఉన్నా.. ఎన్నికల కోడ్ వల్ల ఇన్నాళ్లూ ఇవ్వలేకపోయామని ప్రభుత్వం తెలిపింది.
ఆ జిల్లాల్లో భారీగా పంట నష్టం
మార్చి 16 నుంచి 24వ వరకు కురిసిన వడగళ్ల వాన వల్ల నిజామాబాద్, కామారెడ్డి, సిద్ధిపేట, రాజన్నసిరిసిల్ల, ఆదిలాబాద్, నిర్మల్, సంగారెడ్డి త మంచిర్యాల, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో పంట నష్టం జరిగింది. మొత్తం 15,814.03 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు తేల్చారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని.. మనీ విడుదలకు ఈసీ ఒప్పుకుంది.
తమ అకౌంట్లలోకి 2 రోజుల్లో మనీ రాకపోతే.. ఆ రైతులు.. వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులను ఆరా తియ్యవచ్చు. ఈ పనిని వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.
2024-05-07T02:32:20Z dg43tfdfdgfd