బ్రెజిల్ లో కుండపోత వర్షాలు.. 37మంది మృతి.. మరో 74 మంది గల్లంతు

బ్రెజిల్ లో కుండపోత వర్షాలు.. 37మంది మృతి.. మరో 74 మంది గల్లంతు

బ్రెజిల్ లో భారీ వర్షాలు విధ్వంసం సృష్టించాయి. బ్రెజిల్‌లోని దక్షిణ రాష్ట్రమైన రియో గ్రాండే దో సుల్ లో భారీ వర్షాలు కురవడంతో వరదలు ముంచెత్తాయి. దీంతో అధిక సంఖ్యలో ఇళ్లు కూలిపోయి.. వంతెనలు, రోడ్లు ధ్వంసమయ్యాయి. బైక్ లు, కార్లు, ఇతర వాహనాలు బురదల్లో చిక్కుకుపోయాయి.వర్షాల కారణంగా 37మంది మృతి చెందగా.. మరో 74 మంది తప్పిపోయినట్లు రాష్ట్ర సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ తెలిపింది.  

వరద ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ  సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. భారీ వరదలకు కూలిన ఇళ్లు, వంతెనలు, రోడ్ల శిథిలాల మధ్య చిక్కుకున్న వారిని గుర్తించేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో గవర్నర్ ఎడ్వర్డో లైట్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. "చరిత్రలోనే అత్యంత ఘోరమైన విపత్తును ఎదుర్కొంటున్నాం. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మరణాల సంఖ్య మరింత పెరుగే అవకాశం ఉంది" అని తెలిపారు.

ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా ప్రభావిత ప్రాంతంపై అధికారులతో చర్చించి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఇండ్లు కోల్పోయిన బాధితులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని తెలిపారు.   

వరద ప్రభావిత ప్రాంతాల్లో 12 విమానాలు, 45 వాహనాలు, 12 పడవలు 626 మంది సైనికులతో పాటు రెస్క్యూ  సిబ్బంది ఆపరేషన్‌ కొనసాగిస్తున్నారు. రోడ్లను క్లియర్ చేయడం, ఆహారం, నీరు, పరుపులు వంటి అవసరమైన సామాగ్రిని పంపిణీ చేయడం, నిరాశ్రులైన వ్యక్తుల కోసం ఆశ్రయాలను ఏర్పాటు చేయడంపై అధికారులు దృష్టి పెట్టారు.  మరోవైపపు రాష్ట్రంలోని ప్రధాన గుయిబా నది ప్రమాదకర స్థాయికి చేరుకునే అవకాశం ఉండడంతో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నదులు, కొండ ప్రాంతాలకు సమీపంలో ఉన్న నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఏజెన్సీ ఆదేశించింది. 

©️ VIL Media Pvt Ltd.

2024-05-04T03:52:34Z dg43tfdfdgfd