మూడో దశలో 63 శాతం
11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 నియోజకవర్గాల్లో ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ అత్యధికంగా అస్సాంలో 77.06 % , అత్యల్పంగా యూపీలో 57% గాంధీనగర్లో ఓటేసిన ప్రధాని మోదీ, అహ్మదాబాద్లో అమిత్ షా, కర్నాటకలో ఓటు హక్కును వినియోగించుకున్న కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల సమరంలో మూడో దశ పోలింగ్ ముగిసింది. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 నియోజకవర్గాల్లో మంగళవాడరం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ రాత్రి 6 గంటల వరకూ కొనసాగింది. అన్ని నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 63 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. అస్సాంలో 77.06 శాతం ఓటింగ్ జరిగింది. ఉత్తరప్రదేశ్లో అత్యల్పంగా 57.34 శాతం పోలింగ్ నమోదైంది. వాస్తవానికి ఈసీ ఈ మూడోదశ ఎన్నికల్లో మొత్తం 94 నియోజకవర్గాలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. గుజరాత్లోని సూరత్ నియోజకవర్గంలో ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్ను ఉపసంహరించుకోవడంతో బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆ లోక్ సభ స్థానానికి ఎన్నిక జరగడం లేదు. ఈ దశలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా సహా కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా(గుణ), మన్సుఖ్ మాండవియా (పోర్బందర్), పురుషోత్తమ్ రూపాలా (రాజ్కోట్), ప్రహ్లాద్ జోషి (ధార్వాడ్), ఎస్పీ సింగ్ బఘేల్ (ఆగ్రా) తదితర ప్రముఖులు బరిలో ఉన్నారు.
ఆయా నియోజకవర్గాల్లోని పోలింగ్ బూత్లలో చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. బెంగాల్లోని జాంగిపూర్లో స్వల్ప ఘర్షణలు జరిగాయి. బీజేపీ క్యాండిడేట్ ధనుంజయ్ ఘోష్ కు స్థానిక తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కార్యకర్తకు మధ్య గొడవ జరిగింది. పోలింగ్ బూత్ల వద్ద ధనుంజయ్ ఘోష్ ఓటర్లను ప్రభావితం చేస్తున్నాడని టీఎంసీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ముర్షీదాబాద్లోనూ టీఎంసీ, బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. కరీంపూర్ సీటు పరిధిలోని కొన్ని బూత్ల వెలుపల టీఎంసీ, సీపీఎం, డోమ్కోల్ ప్రాంతంలో టీఎంసీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. కాగా, యూపీలోని మెయిన్పురిలో బూత్లను దోచుకునేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారని అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలను పోలీస్స్టేషన్లలో బంధిస్తున్నారని మండిపడ్డారు. రోడ్డు వేయనందుకు బుదౌన్ పరిధిలోని ధోరన్పూర్ గ్రామస్తులు ఎన్నికలను బాయ్కాట్చేశారు. తమ సమస్యలను పరిష్కరించడం లేదంటూ ఫిరోజాబాద్ పరిధిలోని నాగ్లా జవహర్, నీమ్ ఖేరియా, నాగ్లా ఉమర్ గ్రామాల్లో ఒక్క ఓటుకూడా వేయలేదు. కర్నాటకలో ఎలక్షన్ డ్యూటీలో ఉన్న ఇద్దరు అధికారులు గుండెపోటుతో మృతిచెందినట్టు ఈసీ వెల్లడించింది.
పలుచోట్ల ప్రముఖులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. గుజరాత్లోని గాంధీనగర్ పోలింగ్బూత్లో ప్రధాని మోదీ ఓటు వేయగా.. అహ్మదాబాద్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా కుటుంబంతో కలిసి ఓటేశారు. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఓటు వేశారు. యూపీలోని సైఫాయిలో సమాజ్వాదీ(ఎస్పీ) పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఆయన సతీమణి డింపుల్ యాదవ్ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
©️ VIL Media Pvt Ltd. 2024-05-08T02:51:57Z dg43tfdfdgfd