మోదీ, అమిత్ షాకు నా గురించి తెల్వదనుకుంటా: రేవంత్ రెడ్డి
బీజేపీ దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. తుక్కుగూడ కార్నర్ మీటింగ్ లో మాట్లాడిన రేవంత్.. కాంగ్రెస్ పాంచ్ న్యాయ్, పచ్చీస్ గ్యారంటీలతో మోదీ, అమిత్ షాలకు నిద్రపట్టట్లేదన్నారు. అందుకే అయోధ్య, శ్రీరాముడు దేవుళ్ల గురించి మాట్లాడుతున్నారని చెప్పారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ట కాకముందే గ్రామాలకు అక్షింతలు పంపారని విమర్శించారు. రేషన్ బియ్యం తీసుకొచ్చి పసుపు కలిపి ఇవే రాములోరి అక్షింతలు అని రాముడిని మోసం చేశారని ధ్వజమెత్తారు.
దేవుళ్ల గురించి ఎవరో వచ్చి తమకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు రేవంత్ రెడ్డి. దేవుడు గుడిలో ఉండాలి..భక్తి గుండెల్లో ఉండాలి.. వాళ్లే నిజమైన హిందువులని అన్నారు. దేవుడి పేరు చెప్పి రాజకీయాలు చేసే మోదీ, అమిత్ షా నకిలీ హిందువులని ఆరోపించారు రేవంత్. బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తదన్నందుకు తనను అరెస్ట్ చేయడానికి ఢిల్లీ నుంచి పోలీసులను పంపించారు. మోదీ, అమిత్ షా కు నా గురించి తెలుసో తెల్వదో.. తెల్వకపోతే తెలుసుకోండి. నన్ను అరెస్ట్ చేయించి జైల్లో పెడితే..కార్యకర్తల అండదండలతో కేసీఆర్ ను అసెంబ్లీ ఎన్నికల్లో బొందపెట్టినం. కావాలంటే మోదీ, అమిత్ షా కేసీఆర్ కు సీక్రెట్ గా ఫోన్ చేసి తెలుసుకోవాలని సూచించారు రేవంత్ .
బీఆర్ఎస్ కు ఓటేస్తే గోదారిలో వేసినట్టేనన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ తల్లిని అడ్డం పెట్టుకుని కేసీఆర్ వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. కేటీఆర్ జన్వాడలో వెయ్యికోట్లతో ఫాంహౌజ్..కేసీఆర్ ఎర్రవల్లిలో వెయ్యి ఎకరాల్లో ఫామ్ హౌజ్ కట్టుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర విభజన సమయంలో తల్లిని చంపి పిల్లను కాపాడారని.. తెలంగాణ రాష్ట్రాన్ని హేలన చేసిన మోదీకి ఓటు అడిగే హక్కు లేదన్నారు రేవంత్.
సబితా ఇంద్రారెడ్డి తనను నమ్ముకున్న కార్యకర్తలను మోసం చేస్తుందన్నారు రేవంత్.. బీఆర్ఎస్ కు ఓటెయ్యాలని అడగకుండా.. బీజేపీకి ఓటెయ్యాలని అడగడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.
©️ VIL Media Pvt Ltd. 2024-05-05T16:28:26Z dg43tfdfdgfd