రాజ్యాంగం పోతే.. రిజర్వేషన్లు కూడా పోతయ్​ : కోదండ రామ్

రాజ్యాంగం పోతే.. రిజర్వేషన్లు కూడా పోతయ్​ : కోదండ రామ్

  • ప్రజలెవరూ ఆత్మగౌరవంతో బతకలేరు
  • కేయూలో దాడి భావ ప్రకటనా స్వేచ్ఛపై జరిగిన దాడే  
  • భారత్​ బచావో సదస్సులో ప్రొఫెసర్ ​కోదండ రామ్​

హనుమకొండ/ జనగామ అర్బన్, వెలుగు : రిజర్వేషన్లకు రాజ్యాంగమే ప్రాతిపదిక అని, రాజ్యాంగం పోతే..రిజర్వేషన్లు కూడా పోతాయని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ ​కోదండ రామ్​అన్నారు. రాజ్యాంగాన్ని మారిస్తే ప్రజలెవరూ ఆత్మగౌరవంతో బతికే అవకాశం ఉండదన్నారు. భారత్​బచావో హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం సుబేదారిలోని అసుంతా భవన్​లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలు, వైఫల్యాలు అనే అంశంపై నిర్వహించిన సదస్సులో కోదండరాం మాట్లాడారు. బీజేపీ నాయకులు మొదట్నుంచీ రాజ్యాంగాన్ని సవరిస్తామంటున్నారని, వాజ్​పేయీ ప్రధానిగా ఉన్న సమయంలోనే రాజ్యాంగ సవరణ కోసం జస్టిస్​ వెంకటాచలయ్య కమిషన్​వేశారన్నారు.

రాజ్యాంగ పరిరక్షణే అందరి లక్ష్యం కావాలని కోదండరాం పిలుపునిచ్చారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎదిరించిన వారిపై దాడులకు పాల్పడుతోందని, కేయూలో కవులు, రచయితల మీద దాడి భావప్రకటనా స్వేచ్ఛపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్​ మధ్య జరుగుతున్నవి కాదని..బీజేపీకి..సామాన్య ప్రజలకు మధ్య జరుగుతున్నవేనని స్పష్టం చేశారు. తర్వాత ‘ప్రమాదంలో భారత రిపబ్లిక్​, పౌరుల పాత్ర’ అనే అంశంపై ప్రముఖ రచయిత, రాజకీయ ఆర్థిక విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ ​ప్రసంగించారు.

జనగామ​ విజయ ఫంక్షన్​ హాల్​లో ఇదే అంశంపై సాదిక్​ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించగా పరకాల ప్రభాకర్ పాల్గొని మాట్లాడుతూ మతం మన దేశంలో ఒక రాజకీయ అంశంగా మారిందని, మత విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా బీజేపీ అధికారంలోకి రావడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. కోదండరామ్​ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని, అయినప్పటికీ మతతత్వ పార్టీలతో జాగ్రత్తగా ఉండాలన్నారు. సాదిక్​అలీ, దళిత రత్న డాక్టర్​రాజమౌళి, విద్యావేత్త రియాజ్ ​పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-08T04:07:08Z dg43tfdfdgfd