వాటా డబ్బులు ఇవ్వనందుకు మర్డర్
గండిపేట, వెలుగు: డబ్బుల లావాదేవీల కారణంగా మర్డర్ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రాజేంద్రనగర్ డీసీపీ సీహెచ్ శ్రీనివాస్, ఏసీపీ టి.శ్రీనివాస్ మంగళవారం అత్తాపూర్ పీఎస్ లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. హసన్నగర్ కు చెందిన మక్బుల్ అహ్మద్(40), మనోజ్కుమార్, అబ్రార్, అమ్జద్ ఫ్రెండ్స్. వీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయగా వచ్చిన డబ్బును ముగ్గురూ పంచుకుంటూ అమ్జద్కు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారు. దీంతో తనకు రావాల్సిన వాటా డబ్బులు ఇవ్వాలని అమ్జద్ వారిని బతిమిలాడినా వినిపించుకోకుండా హేళన చేశారు.
దీంతో కోపోద్రిక్తుడైన అమ్జద్ ముగ్గురిని హత్య చేసేందుకు ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా మూడు రోజుల నిఘా పెట్టాడు. ఈనెల 4న హసన్నగర్ ఇందిరానగర్ బస్టాప్ వద్ద ఉన్న మక్బుల్ అహ్మద్, మనోజ్పై అమ్జద్ తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. మక్బుల్ స్పాట్ లో చనిపోగా మనోజ్కు తీవ్రగాయాలు అయ్యాయి. అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంగళవారం నిందితుడు అమ్జద్ను అరెస్టు చేసి కత్తితో పాటు బైక్ ను స్వాధీనం చేసుకొని రిమాండ్కు పంపినట్టు పోలీసులు తెలిపారు.
©️ VIL Media Pvt Ltd. 2024-05-08T02:36:55Z dg43tfdfdgfd