వైసిపి ఎమ్మెల్యే నుండి కాపాడండి మహాప్రభో... చేతివేలు కట్ చేసుకుని ఏపీ మహిళ ఆందోళన

ఆంధ్ర ప్రదేశ్ : తన గురువు కోరాడని బొటనవేలును తృణపాయంగా కొసిచ్చాడు ఏకలవ్యుడు. కానీ తమ ప్రాంతంలో జరుగుతున్న అవినీతి, అక్రమాల నుండి ప్రజలను కాపాడాలంటూ ఆనాటి ఏకలవ్యుడిని ఫాలో అయ్యింది ఓ తెలుగు మహిళ. దేశ రాజధాని డిల్లీలోని ఇండియా గేట్ ముందే ఓ తెలుగు మహిళ బొటనవేలు నరుక్కుని నిరసన తెలిపింది. ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల హడావిడి కొనసాగుతున్న వేళ ఈ మహిళ చేసినపని రాజకీయ దుమారం రేపుతోంది.  

అసలేం జరిగింది :  

ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన కోపూరి లక్ష్మి ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు. మహిళా సాదికారత కోసం తమ మహిళామండలి ప్రయత్నిస్తుంటే వైసిపి నాయకులేమో మహిళలతో చేయకూడని పనులు చేయిస్తున్నారని లక్ష్మి వాపోయారు. ప్రత్తిపాడులో అయితే పరిస్థితి మరీ దారుణంగా వుందని ... స్థానిక ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, అనుచరుల అరాచకాలు మరీ మితిమీరిపోయేలా వున్నాయని ఆరోపిస్తున్నారు. వీళ్లు మహిళలతో గంజాయి అమ్మిస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు తప్పుడు పత్రాలతో ప్రజల ఆస్తులను దోచుకుంటున్నారని ... ఈ అరాచకాలపై ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని లక్ష్మి ఆరోపించారు. 

మహిళా ఎమ్మెల్యే వున్నప్పటికీ ప్రత్తిపాడులో మహిళలకు రక్షణలేకుండా పోయిందని లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసారు. ఇక్కడ జరుగుతున్న అక్రమాలు అరాచకాలను దేశ ప్రజల దృష్టికి తీసుకువచ్చేందుకు తోటి మహిళా మండలి సభ్యులతో కలిసి రాజధాని డిల్లీకి వచ్చినట్లు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న అరాచకాలపై ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ లకు ఫిర్యాదు చేయాలని భావించామన్నారు. కానీ వారి అపాయింట్ మెంట్ దొరకలేదు... అందువల్లే మరో మార్గంలో ఏపీలో పరిస్థితులను ప్రజలకు తెలియజేయాలని అనుకున్నట్లు లక్ష్మి తెలిపారు. 

ఏకలవ్య ఆందోళన :  

ఆంధ్ర ప్రదేశ్  లో మరీ ముఖ్యంగా ప్రత్తిపాడులో జరుగుతున్న అరాచకాలను బయటపెట్టాలంటే దేశ ప్రజల దృష్టిలో పడాలి. అందుకోసం ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే 'ఏకలవ్య నిరసన' గుర్తుకు వచ్చిందని లక్ష్మి తెలిపారు. దీంతో వెంటనే చారిత్రాత్మక, ప్రముఖ పర్యటక ప్రాంతం ఇండియా గేట్ వద్దకు చేరుకున్నట్లు... తన బొటనవేలిని కత్తితో నరికేసుకున్నట్లు తెలిపారు. మహాభారతంలో ఏకలవ్యుడిని స్పూర్తిగా తీసుకునే ఇలా వేలు నరుక్కున్నానని ... అవినీతి, అక్రమాలపై తన పోరాటంలో వున్న నిజాయితీని తెలియజేసానని లక్ష్మి పేర్కొన్నారు. 

ఆంధ్ర ప్రదేశ్ తో పాటు దేశ ప్రజలందరికీ ప్రత్తిపాడులో ఏం జరుగుతుందో తెలియజేయాలన్నదే తన ప్రయత్నమన్నారు లక్ష్మి. ఇప్పటికైనా డిల్లీ పెద్దలు తమ ప్రాంతంలో జరుగుతున్న అక్రమాలపై దృష్టి పెట్టాలని... ప్రజలు ప్రశాంతంగా జీవించేలా చూడాలని కోరారు. తాను ఏ రాజకీయ పార్టీ కోసమో ఈ పని చేయలేదు... కేవలం ప్రజల కోసమే ఇదంతా చేసానన్నారు. 

 

మేకతోటి వర్గం ఏమంటోంది : 

కోపూరి లక్ష్మి నిరసనపై మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత భర్త, వైసిపి నాయకులు మేకతోటి దయాకర్ స్పందించారు. ఆమె ఎవరో తనకు తెలియదని... ఎందుకోసం తమపై తప్పుడు ఆరోపణలు చేస్తుందో అర్థంకావడం లేదని అన్నారు. తనకు గాని, భార్య సుచరితకు గానీ ఎలాంటి అవినీతి, అక్రమాలతో సంబంధం లేదని దయాకర్ స్పష్టం చేసారు. 

2024-04-23T10:05:07Z dg43tfdfdgfd