సెల్ ఫోన్లు కొట్టేసి సూడాన్కు ఎక్స్పోర్ట్
హైదరాబాద్, వెలుగు: సెల్ఫోన్లు చోరీచేసి విదేశాలకు తరలిస్తున్న అంతర్జాతీయ ముఠా గుట్టు రట్టయింది. హైదరాబాద్ లోని అబిడ్స్ జగదీశ్ మార్కెట్ అడ్డాగా సాగుతున్న చోరీ సెల్ఫోన్ల దందాలో సూడాన్కు చెందిన ఐదుగురితో పాటు మొత్తం17 మందిని హైదరాబాద్ సిటీ టాస్క్ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.1.75 కోట్ల విలువ చేసే 703 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను సిటీ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస రెడ్డి.. మీడియాకు వెల్లడించారు. పాతబస్తీ తాడ్బన్కు చెందిన మహ్మద్ ముజమ్మిల్ అలియాస్ ముజ్జు (19) ఫ్లవర్ డెకరేషన్ వర్కర్గా పనిచేస్తున్నాడు.
జహనుమాకు చెందిన సయ్యద్ అబ్రార్ (19) ఉబెర్ డ్రైవర్గాగ పనిచేస్తున్నాడు. వీరిద్దరూ స్నేహితులు. చెడు వ్యసానాలకు బానిసలై సెల్ఫోన్ల చోరీలకు ప్లాన్ చేశారు. ఓల్డ్ సిటీతో పాటు హైదరాబాద్లోని నిర్మానుష్య ప్రాంతాల్లో సెల్ఫోన్లు చోరీ చేయడం ప్రారంభించారు. రాత్రి10 గంటలు దాటిన తరువాత రోడ్లపై కనిపించిన వారిని టార్గెట్ చేసేవారు. అడ్రెస్ అడిగే నెపంతో వారి దృష్టి మళ్లించి స్మార్ట్ఫోన్లు కొట్టేసేవారు. ఇలా గ్రేటర్ హైదరాబాద్లోని మూడు కమిషనరేట్ల పరిధిలో వరుసగా సెల్ఫోన్లు దొంగిలించారు.
ఇలా దొంగిలించిన ఫోన్లను సంతోష్ నగర్కు చెందిన బైక్ మెకానిక్, సెకండ్ హ్యాండ్ ఫోన్ డీలర్ సయ్యద్ సలీం (21) కు తక్కువ ధరకు విక్రయించేవారు. ఈ క్రమంలోనే హఫీజ్ బాబానగర్కు చెందిన పతన్ రబ్బానీ ఖాన్ (34), చాంద్రాయణగుట్టకు చెందిన మహ్మద్ అతర్ (32), డబిర్పురకు చెందిన మహ్మద్ జకీర్ (35), మొగల్పురకు చెందిన షేక్ అజహర్ (31), నిజాముద్దీన్ (49), లాయక్ (32), మొయినుద్దీన్ (32) సెల్ఫోన్లు దొంగిలించి అమ్మేవారు. ప్రధానంగా అబిడ్స్ జగదీశ్ మార్కెట్లోని రిపేరింగ్ సెంటర్లు, సెకండ్ హ్యాండ్ దుకాణాల్లో అమ్మేవారు.
సంతోష్ నగర్కు చెందిన మహ్మద్ షఫీ అలియాస్ బబ్లూ(28), బంజారాహిల్స్కు చెందిన యలమంద రెడ్డి (44) జగదీశ్ మార్కెట్లో సెల్ఫోన్ రిపేరింగ్ షాప్ నిర్వహిస్తున్నారు. సెల్ఫోన్ స్నాచర్లు దొంగిలించిన స్మార్ట్ ఫోన్లను వీరు తక్కువ ధరకు కొనుగోలు చేసేవారు. వాటిలో ఐ ఫోన్ స్క్రీన్స్, కెమెరాలు, స్పీకర్లు సహా ఇతర విడిభాగాలను మార్చి తమ వద్దకు రిపేరింగ్ కోసం వచ్చిన ఫోన్లకు వాటిని బిగించేవారు. ఇందుకు బాగా ఎక్కువగా చార్జ్ చేసేవారు.ఈ క్రమంలోనే దొంగిలించిన ఫోన్లను సెకండ్ హ్యాండ్ కింద విక్రయించేవారు. అలాగే రిపేర్ చేసిన ఫోన్లను సూడాన్కు తరలించేవారు.
ఐఎమ్ఈఐ ట్రేస్ కాకుండా సూడాన్కు దొంగిలించిన ఫోన్లను ఇండియాలో ట్రేస్ చేస్తుండడంతో పక్కా ప్లాన్ చేశారు. ఐఎమ్ఈఐ నంబర్ ట్రేస్ కాకుండా విదేశాలకు ఎగుమతి చేసేందుకు గ్యాంగ్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకోసం సిటీలో నివాసం ఉంటున్న సూడాన్ దేశానికి చెందిన యువకులకు వారాల చొప్పున జీతాలు, కమీషన్స్ ఇచ్చేవారు. ఇందులో భాగంగా మాసాబ్ ట్యాంక్, బంజారా హిల్స్లోని సూడాన్ కాలనీలో నివాసం ఉండే ఖలీద్ అడ్బెల్బగి అలబడ్వి (36), ఒస్మాన్ బబికర్ (36), మహ్మద్ సలీహ్ (34), అనస్ సిద్దిగ్ అహ్మద్(24), ఒమర్ అబ్దల్ల (27) తో సెల్ఫోన్ల సప్లయ్ ప్రారంభించారు. హైదరాబాద్లో కొట్టేసిన ఫోన్లను ఓడల్లో సూడాన్ కు తరలించేవారు. కస్టమ్స్ సహా ఇతర ఏజెన్సీలు గుర్తించకుండా పార్సిల్ చేసేవారు.
ముజ్జు, సయ్యద్ అబ్రార్ ఈనెల 1న ఎల్బీ నగర్ లో పల్సర్ బైక్ దొంగిలించారు. బైక్పై తిరుగుతూ బండ్లగూడ, ఫలక్నుమా, బహదూర్పుర, మంగళ్హాట్, హయత్ నగర్ లో సెల్ఫోన్లు కొట్టేశారు. బైక్ చోరీతో పాటు వరుస సెల్ఫోన్ల చోరీలు జరుగుతుండడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసుల ఆధ్వర్యంలో దర్యాప్తు చేశారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ముజ్జు, సయ్యద్ను అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారంతో మరో 15 మంది సెల్ఫోన్ దొంగలు, ఐదుగురు సూడాన్ దేశీయులను అరెస్టు చేశారు. వారి వద్ద మొత్తం 703 స్మార్ట్ఫోన్లను రికవరీ చేశారు.
©️ VIL Media Pvt Ltd. 2024-04-27T04:25:22Z dg43tfdfdgfd