ఆ వాట్సప్ చాట్ తప్పని నిరూపిస్తే.. చంచల్‌గూడ జైలుకు వెళ్లేందుకు నేను రెడీ: కేటీఆర్

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఓవైపు ఎన్నికల హడావుడి జోరందుకోగా.. మరోవైపు నీటికొరతతో జనాలు ఇబ్బంది పడుతున్నాయి. ఈ క్రమంలోనే.. ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న నీటి కష్టాలు ఇప్పుడు రాజకీయ రంగు పులుముకున్నాయి. నీటికొరత కారణంగా హాస్టళ్లు, మెస్‌లు మూసేస్తున్నామంటూ చీఫ్ వార్డెన్ ఓ ప్రకటన విడుదల చేయగా.. అదే విషయంపై స్పందించిన బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా.. క్రిశాంక్ అరెస్టును తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కీలక వ్యాఖ్యలు చేశారు. గతేడాది కేసీఆర్ ప్రభుత్వంలోనూ ఇలాంటి నోటీసులే వచ్చాయంటూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీ్ట్ చేయగా.. దానిపై కేటీఆర్ స్పందించారు.

అయితే.. ఈ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ఫేక్ అని కేటీఆర్ ఆరోపించారు. సీఎం స్థాయి వ్యక్తి ఫోర్జ్ డాక్యుమెంట్ షేర్ చేయటంపై విద్యార్థుల నుంచి వందల మెస్సేజులు వచ్చాయని తెలిపారు. ఓయూ విద్యార్థులు గ్రూప్‌లో గతేడాది ఇదే సమయంలో విడుదలైన ఒరిజినల్ నోటీసును.. అందుకు సంబంధించిన గ్రూప్ వాట్సప్ చాట్‌ను ప్రదర్శించారు కేటీఆర్. ఒరిజినల్ డాక్యుమెంట్‌లో నీటి కొరత, విద్యుత్ కొరత ఏం లేదని చెప్పుకొచ్చారు. తాను ప్రదర్సించిన వాట్సప్ చాట్ కానీ.. తాను చెప్పింది కానీ తప్పని నిరూపిస్తే చంచల్ గూడ జైలుకు పోవడానికి సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు. ఒకవేళ తాను చెప్పిన విషయాలు నిజమైతే.. అదే చంచల్ గూడ జైలుకు ముఖ్యమంత్రి వెళ్లేందుకు సిద్ధమా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.

ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ అధినేత‌, కేసీఆర్ గారి బ‌స్సు యాత్ర ప్రారంభంతో కాంగ్రెస్, బీజేపీ నేత‌ల గుండెల్లో ద‌డ పుట్టింద‌ని బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ బ‌స్సు యాత్రకు వ‌స్తున్న ప్రజా స్పంద‌న‌ను చూసి ఆ రెండు పార్టీలు ఓర్వలేక‌పోతున్నాయ‌ని కేటీఆర్ మండిప‌డ్డారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన ప‌రుష ప‌దజాలం మీద ఎన్నిక‌ల సంఘానికి 8 ఫిర్యాదులు ఇచ్చామని కానీ.. ఎలాంటి చ‌ర్యలు లేవన్నారు.

"కేసీఆర్‌ను ఉరితీస్తాం.. లాగుల తొండ‌లు వ‌దులుతాం.. ముడ్డి మీద డ్రాయ‌ర్ కూడా ఉండ‌దు.. కేసీఆర్ త‌ల న‌ర‌కండి.. కేసీఆర్ త‌ల తెగ్గోయండి" అని రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మాట‌లు ఎన్నిక‌ల సంఘానికి నీతిసూక్తులు, సుభాషితాల్లాగా వినబ‌డుతున్నట్లుందన్నారు. ఈ మాటలు ఈసీకి వినిపించ‌వని.. అదే కేసీఆర్ నేత‌న్నలు, రైతుల ప‌క్షాన‌ గ‌ట్టిగా ఒక్క మాట మాట్లాడితే.. 48 గంట‌ల నిషేధం విధించారని కేటీఆర్ మండిపడ్డారు.

బ‌డా భాయ్.. చోటా భాయ్ క‌న్నుస‌న్నల్లో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప‌ని చేయ‌క‌పోతే.. తామిచ్చిన‌ 27 ఫిర్యాదుల‌పై స్పందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రేవంత్ మీద 8, మ‌రో 19 ఫిర్యాదులు మిగ‌తా పార్టీ నాయ‌కులు, వారి వైఖ‌రి మీద ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. ఒక్కటంటే ఒక్కదాని మీద కూడా చ‌ర్య లేదన్నారు. కొండా సురేఖ‌కు మంద‌లింపు త‌ప్ప ఒక్కటంటే ఒక్క చ‌ర్య లేదని.. వారి ప్రచారాన్ని నిషేధించ‌లేదన్నారు. కేసీఆర్ బ‌స్సు యాత్ర ప్రారంభించ‌గానే కాంగ్రెస్‌కు, బీజేపీకి ద‌డ పుట్టిందన్నారు కేటీఆర్.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-02T13:52:04Z dg43tfdfdgfd