ఆరోజు కేసీఆర్ చేసిన పనికి వాళ్లిద్దరూ బాధపడ్డారు.. తెరవెనుక విషయాన్ని బయటపెట్టిన ఈటల రాజేందర్

Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో.. మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం రోజున సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడిన ఈటల రాజేందర్.. బీఆర్ఎస్ హయాంలో మంత్రుల పట్ల కేసీఆర్ తీరు గురించి ప్రస్తావిస్తూ తెర వెనుక జరిగిన పలు విషయాలను వెల్లడించారు.

కేసీఆర్ వద్ద అంతో ఇంతో తప్పును తప్పు అని చెప్పగలిగిన ఏకైక వ్యక్తిని తానే అని ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు. గతంలో కేసీఆర్ మంత్రివర్గంలో పని చేసి.. ఇవాళ కాంగ్రెస్‌లో ఉన్న జూపల్లి, తుమ్మల, కడియం, పట్నం మహేందర్ రెడ్డి తమ గుండెల మీద చేయి వేసుకుని చెప్పాలన్నారు. ఉన్నది ఉన్నట్టుగా ముఖం మీదే చెప్పడం వల్ల తాను కేసీఆర్ వద్ద ఆగ్రహానికి గురయ్యానన్నారు. హౌసింగ్ పాలసీ మీద కేసీఆర్ కమిటీ వేశారు.. అందులో తనతో పాటు హరీశ్ రావు, తుమ్మల నాగేశ్వర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, కడియం శ్రీహరి కూడా ఉన్నారని గుర్తు చేశారు. తాము స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వకముందే పాలసీని డిక్లేర్ చేశారని.. అప్పుడు ఇదే కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వర్ రావు నొచ్చుకున్నారని గుర్తు చేశారు. దీన్ని బట్టి.. కేసీఆర్ పాలనలో మంత్రులకు ఉన్న విలువ ఏంటో అర్థం చేసుకోవచ్చని ఈటల చెప్పుకొచ్చారు.

దేశవ్యాప్తంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించినా అమలు కావట్లేదని ఈటల చెప్పుకొచ్చారు. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిది అని మహిళల పట్ల సానుభూతి కలిగిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని సోనియా గాంధీ ఓ మహిళాగా ఉండి కూడా ముస్లిం మహిళల కోసం త్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకురాలేకపోయారంటూ ఈటల మండిపడ్డారు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వానికి అవకాశమే లేదని మోదీనే మూడోసారి ఫుల్ మెజార్టీతో అధికారంలోకి రాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-07T10:29:55Z dg43tfdfdgfd