TELANGANA HC: ఎన్నికపై వివాదం.. BRS ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు

భారత్ రాష్ట్ర సమితి (BRS) పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు షాక్ తగిలింది. ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారించిన న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిలకు నోటీసులు ఇచ్చింది. వేర్వురు పిటిషన్లను విచారించిన న్యాయస్థానం ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.

గత అసెంబ్లీ ఎన్నికల నామినేషన్‌ సందర్భంగా తప్పుడు వివరాలతో అఫిడవిట్‌ సమర్పించిన మల్లారెడ్డి ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసిన తోటకూర వజ్రేష్‌ యాదవ్‌ ఇటీవల హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ జె.శ్రీనివాస్‌ రావులతో కూడిన సింగల్ బెంచ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది సిద్ధార్థ్‌ పోగుల వాదనలు వినిపిస్తూ.. రిటర్నింగ్‌ అధికారికి చామకూర మల్లారెడ్డి తప్పుడు అఫిడవిట్‌ సమర్పించారన్నారు. సూరారం గ్రామంలో కొంత భూమి ఉందని అఫిడవిట్‌లో పేర్కొన్నారని.. రికార్డుల ప్రకారం అది ప్రభుత్వ భూమి, నాలాగా ఉందని వాదనలు వినిపించారు.

మరో పిటిషన్‌లో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎన్నికను సవాల్‌ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనర్లు సమర్పించిన ఆధారాలపై సంతృప్తి చెందిన న్యాయస్థానం ఎమ్మెల్యేలకు నోటీసులు జారీచేసింది. అనంతరం విచారణను జూన్‌ 16కు వాయిదా వేసింది. అలాగే ఈ రెండు నియోజకవర్గాల్లోని స్ట్రాంగ్‌ రూంలలో ఉన్న ఈవీఎంలను రానున్న లోక్‌సభ ఎన్నికలకు వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వాలంటూ ఎన్నికల సంఘం దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లను న్యాయమూర్తి అనుమతించారు. దీనిపై పిటిషనర్ల తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో ఈవీఎంలను వినియోగించుకోవడానికి న్యాయస్థానం అనుమతించింది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-02T04:20:33Z dg43tfdfdgfd