కరీంనగర్: కూలీ కుమారుడి ప్రతిభ.. రెండేళ్లలో ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు

ప్రస్తుతమున్న పోటీ ప్రపంచంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే గగనం. అలాంటింది ఓ యువకుడు మాత్రం ఏకంగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాడు. ప్రభుత్వం నోటిఫికేషన్లు వేయట్లేదని.. అడపాదడపా వేసినా ఒకటి రెండు మార్కులతోనే జాబ్ మిస్సవుతోందని నిరాశతో ప్రైవేటు రంగంవైపు యువత మొగ్గు చూపుతున్న ఈ రోజుల్లో.. ఓటమి ఎదురైనా ఎలాంటి అసంతృప్తి చెందకుండా ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించి విజయం సాధించాడు. ఎలాంటి కోచింగ్ లేకుండా.. సొంత ప్రిపరేషన్‌తోనే రెండేళ్ల కాలంలో ఏకంగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత సాధించాడు.

జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలంలోని తుంగూర్‌కు చెందిన బెత్తపు లక్ష్మి-మల్లయ్య దంపతులు కూలీ పనులు చేసి కుమారుడు సంజయ్‌ను చదివించారు. పదో తరగతి తుంగూర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివిని సంజయ్.. ఇంటర్‌ జగిత్యాలలో, 2019లో ఇంజినీరింగ్‌(సివిల్‌) పూర్తిచేశాడు.తల్లిదండ్రుల కష్టాన్ని దగ్గర్నుంచి చూసిన సంజయ్ వారి నమ్మకాన్ని వమ్మూ చేయలేదు. స్నేహితుల గదుల్లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు. 2022లో రైల్వేలో గ్రూపు-Dకి ఎంపిక కాగా.. అదే ఏడాది టీఎస్‌పీఎస్‌సీ పరీక్షలు ఉండడంతో ఉద్యోగంలో చేరలేదు.

2023లో టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించిన కానిస్టేబుల్‌ (ఎక్సైజ్‌), టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ అధికారి, గ్రూపు-4, ఏఈఈ(సివిల్‌), ఏఈ పోస్టులకు ఎంపికయ్యాడు. గత నెల 25న ఏఈ పోస్టు ర్యాంకు కార్డు అందుకున్నారు. ప్రస్తుతం కానిస్టేబుల్‌ (ఎక్సైజ్‌) శిక్షణలో ఉన్న సంజయ్‌ ఏఈ ఉద్యోగంలో చేరేందుకు సిద్ధమయ్యాడు. తల్లిదండ్రుల శ్రమ, స్నేహితుల సహకారంతోనే తాను ఉద్యోగాలు సాధించినట్లు సంజయ్ వెల్లడించారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-02T09:51:19Z dg43tfdfdgfd