చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్

Bathukamma Sarees Funds: చేనేత కార్మికులకు రేవంత్ సర్కార్ బూస్ట్ ఇచ్చింది. ఇప్పటికే చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్ల నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న మిగతా బకాయిలను కూడా వీలైనంత తొందరగా విడుదల చేయాలని సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. గతేడాది బతుకమ్మ చీరలకు సంబంధించి నేతన్నలకు అప్పటి బీఆర్ఎస్ సర్కారు హాయంలో దాదాపు రూ.351 కోట్ల బకాయి పడింది. దీంతో వేలాది కార్మిక కుటుంబాలు ఆందోళనకు గురయ్యాయి.

ఈ క్రమంలో.. కాంగ్రెస్ ప్రభుత్వం రావటంతో సిరిసిల్లలో కార్మికులు వరుసగా ఆందోళనలు చేస్తున్నారు. బకాయిలను వెంటనే చెల్లించి.. తమను ఆదుకోవాలని రేవంత్ సర్కారును కోరుతున్నారు. ఈ నేపథ్యంలో.. మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.. చేనేత కార్మికులతో పలుమార్లు చర్చలు జరిపారు. కార్మికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని బకాయిలు విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

దీనికి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే.. బకాయిలను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్థిక వెసులుబాటును దృష్టిలో పెట్టుకొని బకాయిలు చెల్లించాలని సూచించారు. నేతన్నలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుందని.. ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించేలా ఏర్పాట్లు చేస్తుందని భరోసా ఇచ్చారు.

గడిచిన 3 నెలల్లో సమగ్ర శిక్షా అభియాన్ యూనిఫామ్‌ల తయారీకి సుమారు 47 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లించింది. నూలు కొనుగోలు, సైజింగ్‌కు రూ.14 కోట్లు విడుదల చేసింది. వీటితో పాటు గతంలో ఉన్న బకాయిలకు సంబంధించి రూ.50 కోట్లు చెల్లింపునకు సీఎం తీసుకున్న నిర్ణయం నేత పరిశ్రమకు ఊరటనిచ్చినట్లయింది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-19T16:22:44Z dg43tfdfdgfd