YS JAGAN MOHAN REDDY INTERVIEW: తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్‌ సర్కార్ ఓడిపోవటంపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు

YS Jagan Mohan Reddy On KCR: ప్రస్తుతం దేశమంతా సార్వత్రిక ఎన్నికల జాతర నడుస్తోంది. అందులో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం హాట్ హాట్‌గా ఉంది. మళ్లీ అందులోనూ ఏపీ రాజకీయాలు రంజుగా నడుస్తున్నాయి. తెలంగాణలో కేవలం లోక్ సభ ఎన్నికలు మాత్రమే జరుగుతుండగా.. ఏపీ (AP Election 2024) లో మాత్రం అసెంబ్లీ, ఎంపీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తుండటంతో.. రాజకీయాలు మాంచి రసవత్తరంగా మారాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) సింగిల్‌గానే బరిలోకి దిగుతుండగా.. తెలుగుదేశం (Telugu Desam Party), బీజేపీ (BJP), జనసేన (Janasena) పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, కేసీర్ సర్కార్ (Kalvakuntla Chandrashekar Rao) ఓడిపోవటం, రేవంత్ రెడ్డి (Anumula Revanth Reddy) ప్రభుత్వం రావటం, అందుకు సహకరించిన పరిస్థితులపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు.

ప్రముఖ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. "తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోగా.. అందుకు కారణాన్ని కేసీఆర్ చెప్పారు. తాము పదేళ్లలో తెలంగాణ ప్రజలకు సంక్షేమం అందించాం. అభివృద్ధి చేశాం. కానీ.. కాంగ్రెస్ వచ్చి అంతకంటే ఎక్కువ చేస్తామంటూ చెప్పటం వల్ల ప్రజలు ఆ మాటలు నమ్మి మోసపోయారని.. అందుకే బీఆర్ఎస్ ఓడిపోయిందని వివరించినట్టు వివరించారు. మరి ఇప్పుడు ఏపీలో కూడా అలాంటి మేనిఫెస్టోలే కనిపిస్తున్నాయి. మరి తెలంగాణ పరిస్థితులే ఏపీలోనూ వచ్చే అవకాశం ఉందా." అని జర్నలిస్ట్ ప్రశ్నించారు.

దానికి సమాధానంగా.. "తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏమైంది.. ఏం జరిగిందన్న అంశం జోలికి పోవాల్సిన అవసరం లేదు. ఒక ప్రభుత్వం రావటానికి, పాత ప్రభుత్వం పోవటానికి అనేక అంశాలు ప్రభావితం చేశాయి. వాటి లోతుల్లోకి వెళ్లటం వల్ల పెద్దగా సాధించేది ఏమీ లేదు. కానీ.. ఏపీ ప్రజల ముందు ఉన్నది రెండే ఆప్షన్లు.. విలువలు, విశ్వసనీయతకు ఓటేస్తారా.. లేక మోసపోయి అబద్దాలకు ఓటేస్తారా.. అన్నదే వాళ్ల ముందు ఉంది." అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వివరించారు.

అయితే.. ప్రస్తుతం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి కొత్త పథకాలను ప్రకటించకపోగా.. కూటమి మాత్రం చాలా పథకాలను తమ ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. తెలంగాణ అసెంబ్లీలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలకు కొనసాగింపుగా కొన్ని మార్పులు చేయగా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆరు గ్యారెంటీల పేరుతో సుమారు 420 పథకాలను ప్రకటించింది. అయితే.. ఇక్కడ పడిన ప్రభావమే.. ఏపీ ఎన్నికల్లోనూ చూపే అవకాశం ఉందా అన్న చర్చ నడుస్తోంది.

ఇక.. ఏపీలో ఎవరు గెలుస్తారన్న విషయంపై తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆయన కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మళ్లీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే గెలుస్తారని తమకు సమాచారం ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-08T18:29:25Z dg43tfdfdgfd