దేశమంతా తెలంగాణ హామీలు అమలు చేస్తాం: రాహుల్ గాంధీ

Lok Sabha Elections 2024: తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జోరందుకున్నాయి. ఈసారి అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ ముమ్మర ప్రచారం నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే.. సీఎం రేవంత్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్‌గా మారి రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తుండగా.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా రంగంలోకి దిగారు. నిర్మల్‌లో నిర్వహించిన జన జాతర సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సభలో ప్రసంగించిన రాహుల్.. దేశంలో రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని మార్చడం అంటే రిజర్వేషన్లను ఎత్తివేయడమేనని పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ తన మిత్రుల కోసం రూ. 16 లక్షల కోట్ల నిధులను మాఫీ చేశారంటూ రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. 16 లక్షల కోట్లతో 25 కోట్ల మందికి ఉపాధి కల్పించవచ్చని రాహుల్ గాంధీ వివరించారు. తెలంగాణలో ఇచ్చిన అన్ని హామీలను కచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో ఇచ్చిన హామీలను దేశమంతా అమలు చేస్తామని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి మహిళ అకౌంట్లో ఏడాదికి రూ. లక్ష వేస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. దేశంలోని నిరుద్యోగులను మోదీ పట్టించుకోలేదని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాన్ని హక్కుగా మారుస్తామన్నారు. కేంద్రంలోని 30 లక్షల ఖాళీలను వెంటనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో పోడు భూముల సమస్యను త్వరలోనే తీరుస్తామన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ ఆదివాసుల్ని సర్వనాశనం చేసిందన్నారు. ఉపాధి హామీ కింద రోజుకు రూ.400 దినసరి కూలీ ఇస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దేశంలో కులగణన చేసి తీరుతామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-05-05T09:32:41Z dg43tfdfdgfd