ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో మలుపు.. ఆ ఇద్దరు కూడా అరెస్ట్.. ప్రణీత్ రావుతో సమానంగా..!

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తీసుకుంది. ఇప్పటికే పలువురు మాజీ పోలీస్ అధికారులను అరెస్ట్ చేసి విచారిస్తుండగా.. ప్రస్తుతం మరో ఇద్దరు అధికారులను అదుపులోకి తీసుకున్నారు. మాజీ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌ రావు, ఇన్‌స్పెక్టర్‌ గట్టు మల్లును పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరిని.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సిట్‌ అధికారులు విచారిస్తున్నారు. ప్రభాకర్‌ రావు, ప్రణీత్ రావుతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నట్టు సమాచారం.

అయితే.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటికి వచ్చి.. ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావుపై కేసు నమోదు కాగానే మాజీ డీఎస్పీ రాధాకిషన్‌ రావు అమెరికా వెళ్లిపోయారు. దీంతో.. పోలీసులు లుకౌట్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. హైదరాబాద్ తిరిగివచ్చిన రాధాకిషన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు.. ప్రణీత్‌ రావు డ్రైవర్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభాకర్‌ రావుతో సమానంగా రాధాకిషన్‌ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేయడంలో రాధాకిషన్‌ రావుతో పాటు గట్టుమల్లు కూడా కీలకపాత్ర వహించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. ఈ కేసులో ఇప్పటికే ప్రణీత్‌రావుతో పాటు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. భుజంగరావు, తిరుపతన్నను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో బుధవారం వాదనలు ముగియగా.. తీర్పును న్యాయస్థానం రిజర్వ్‌ చేసింది. కాగా.. వీళ్లు ఇచ్చిన స్టేట్ మెంట్లు తీవ్ర స్థాయిలో సంచలనం రేపుతున్నాయి. ఇంటెలీజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు చేయమంటేనే ఇదంతా చేశామంటూ ఒప్పుకోవటం.. రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-03-28T12:29:31Z dg43tfdfdgfd